
న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాల్లో అస్తిత్వ సెంటిమెంట్లు బలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రాంతీయత, భాషకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అందులోనే వారి అస్తిత్వాన్ని ప్రజలు చూసుకుంటారు. కాబట్టి, వీటిపై ఎక్కడ చర్చ జరిగినా దక్షిణాది రాష్ట్రాల్లో ఇది స్పష్టంగా చర్చకు దారితీస్తుంది. ఈగ, బాహుబలి ఫేమ్ కన్నడ యాక్టర్ కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలు, వాటిపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ చేసిన కామెంట్లు లాంగ్వేజ్ వార్కు తెరతీశాయి. కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ లాంగ్వేజ్ వార్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. యాక్టర్ కిచ్చా సుదీప్కు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మద్దతు తెలిపారు.
దక్షిణాది సినిమాలు బాలీవుడ్లోనూ సత్తా చాటుతున్నాయని, దేశవ్యాప్తంగా హిట్ అవుతున్నాయని కన్నడ యాక్టర్ సుదీప్ అన్నారు. దేశ ప్రజలు అందరూ ఆదరించే సినిమాలను దక్షిణాది సినిమాలు రూపొందిస్తున్నాయని కొనియాడారు. ఈ నేపథ్యంలోనే హిందీ ఇక ఎంత మాత్రం జాతీయ భాష కాదని పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో సుదీప్ చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో చర్చ తీవ్రంగా జరిగింది. ఓ యాక్టర్ విక్రాంత్ రోనా కూడా హిందీ ఇక జాతీయ భాష కాదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్గన్ రియాక్ట్ అయ్యారు. కన్నడ యాక్టర్ కిచ్చా సుదీప్కు నేరుగా ట్వీట్ చేసి ఢీకొన్నారు.
‘సొదరా కిచ్చా సుదీప్.. మీరన్నట్లు హిందీ జాతీయ భాష కాదని భావిస్తున్నప్పుడు మీ మాతృభాష సినిమాలు హిందీలో ఎందుకు డబ్ చేసి విడుదల చేస్తున్నారు? హిందీ మా మాతృభాష, అది ఎప్పటికైనా జాతీయ భాషనే. జనగణమన’ అంటూ అజయ్ దేవ్గన్ కిచ్చా సుదీప్ను ట్యాగ్ చేస్తూ హిందీ భాషలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్తో వారిద్దరి మధ్య కొంతసేపు ట్విట్టర్లో లాంగ్వేజ్ వార్ జరిగింది.
‘అజయ్ దేవ్గన్ సర్.. నేను ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యం బహుశా మీకు సరిగ్గా చేరి ఉండకపోవచ్చు. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసినప్పుడు వాటి గురించి పూర్తి వివరాలతో చర్చిస్తాను. అంతేకానీ, రెచ్చగొట్టాలని, బాధపెట్టాలని లేదా చర్చించాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదు. నేనెందుకు అలా చేస్తాను’ అంటూ అజయ్ దేవ్గన్ ట్వీట్కు సమాధానం చెప్పారు. దేశంలోని అన్ని భాషలను తాను గౌరవిస్తానని, ఇష్టపడతానని మరో ట్వీట్లో తెలిపారు.
అనంతరం ఇంకో ట్వీట్లో ‘అజయ్ దేవ్గన్ సర్.. మీరు రాసిన హిందీ భాషను నేను అర్థం చేసుకోగలిగాను. ఎందుకంటే.. మేం హిందీని గౌరవించి, ఇష్టంతో నేర్చుకున్నాం కాబట్టి. బాధపడొద్దు.. కానీ, నేను నా స్పందనను కన్నడ భాషలో ఇచ్చి ఉంటే ఎలా ఉండేదని ఆలోచిస్తున్నాను. మేం కూడా భారతీయులం కాదా సార్’ అని పేర్కొన్నారు.
అనంతరం ఆయన అజయ్ దేవ్గన్ కూడా తనకు బహుశా అనువాదంలో సారాంశం సరిగ్గా లభించకపోయి ఉండొచ్చని, ఈ బేధాభిప్రాయాన్ని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. అనువాదం, విశ్లేషనలు దృక్పథాలేనని, అందుకే నేపథ్యం పూర్తిగా తెలుసుకోనంత వరకు ఆ వ్యాఖ్యలు సరిగ్గా అర్థం కావు అని కిచ్చా సుదీప్ రియాక్ట్ అయ్యారు.
దాదాపు ఈ వివాదం సద్దుమణిగిందనే అందరూ అనుకున్నారు. కానీ, తాజాగా, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. కిచ్చా సుదీప్ వ్యాఖ్యలు సరైనవని పేర్కొన్నారు. మన రాష్ట్రాలు భాషా ఆధారంగానే ఏర్పడ్డాయని అన్నారు. ప్రాంతీయ భాషలు అన్నింటికి ప్రాధాన్యతను ఇచ్చారని తెలిపారు. సుదీప్ ప్రకటన సరైనదేనని, ప్రతి ఒక్కరూ ఆయన వ్యాఖ్యలను గౌరవించాలని వివరించారు.