
న్యూఢిల్లీ: సెవెన్ అప్ నింబూజ్ కూల్ డ్రింక్ చాలా మంది తాగే ఉంటారు. కానీ, అది నిమ్మరసమా? లేక ఫ్రూట్ జ్యూసా అనే అనుమానం ఎందరికి వచ్చి ఉంటుంది. దీని గురించి ఇది వరకు ఆలో్చించే ఉండరు. కానీ, 2015 నుంచి దీనిపై ఓ కేసు నడుస్తున్న విషయం తెలుసా? ఔను. అది నిమ్మరసమా? ఫ్రూట్ జ్యూసా తేల్చాలని సుప్రీంకోర్టులో ఓ కంపెనీ పిటిషన్ వేసింది. ఆ విషయాన్ని తేల్చడానికి సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. ఆ విషయాన్ని సుప్రీంకోర్టు తేల్చగానే.. నింబూజ్ కేటగిరీ మార్పుపై నిర్ణయం ఆధారపడి ఉంది. ఈ కేటగిరీ ఆధారంగానే ఎక్సైజ్ సుంకం ఎంత విధించాలనే అంశాన్ని అధికారులు నిర్ణయించనున్నారు.
ఆరాధన ఫుడ్స్ అనే కంపెనీ నింబూజ్ డ్రింక్ను నిమ్మరసం కేటగిరీలోకి చేర్చాలని పిటిషన్ ఫైల్ చేసింది. ప్రస్తుతం నింబూజ్ కూల్ డ్రింక్ను ఫ్రూట్ జ్యూస్ ఆధారిత డ్రింక్ లేదా ఫ్రూట్ పల్ప్ అనే కేటగిరీలో ఉన్నది. ఈ పిటిషన్ను విచారిస్తామని మార్చి 11న సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. ఏప్రిల్ నెలలో ఈ విచారణ మొదలు కానున్నట్టు తెలుస్తున్నది.
నింబూజ్ ప్రస్తుత కేటగిరీ అలహాబాద్ కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పెల్లెట్ ట్రిబ్యుల్ బెంచ్ ఆదేశాలతో నిర్ణయించారు. గతేడాది నవంబర్లో ఈ నిర్ణయం జరిగింది. జస్టిస్ దిలీప్ గుప్తా, జస్టిస్ పీ వెంటక సుబ్బా రావుల ధర్మాసనం ఈ నింబూజ్ కూల్ డ్రింక్ను ఫ్రూట్ జ్యూస్ బేస్డ్ డ్రింక్గా పేర్కొంది. తద్వారా ఇది సెంట్రల్ ఎక్సైజ్ టారిఫ్లో టారిఫ్ ఐటమ్ 2202 90 20 కిందకు వచ్చింది.
కానీ, ఈ ఆదేశాలను ఆరాధన ఫుడ్స్ తప్పుపట్టింది. ఈ డ్రింక్ను 1985 సెంట్రల్ ఎక్సైజ్ టారిఫ్ యాక్ట్ ఫస్ట్ షెడ్యూల్ సీఈటీహెచ్ 2022 10 20 కిందకు చేర్చాలని డిమాండ్ చేసింది. అంతేకాదు, ఫిబ్రవరి 2009 నుంచి డిసెంబర్ 2013 వరకు నిమ్మరసంగా భావించి అదనపు డ్యూటీని చెల్లించాలని అడిగింది.
నింబూజ్ డ్రింక్ను 2013లో పెప్సికో లాంచ్ చేసింది. నింబూజ్ డ్రింక్ను రియల్ లెమన్ జ్యూస్గా పేర్కొంది. దీంతో ఈ నింబూల్ కూల్ డ్రింగ్ కేటగిరీపై చర్చ లేసింది. ఈ నింబూజ్ డ్రింక్ను నిమ్మరసంగా పరిగణించాలా?లేక ఫ్రూట్ జ్యూస్గా పరిగణించాలా అనే చర్చ జరిగింది.