సునంద పుష్కర్ కేసు: ముందస్తు బెయిల్ కోసం కోర్టుకెక్కిన థరూర్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సునంద పుష్కర్ ఆత్మహత్య కేసులో ఆమె భర్త.. మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణను పూర్తి చేసిన ఢిల్లీ పోలీసులు సునందను ఆత్మహత్యకు ప్రేరేపించేలా థరూర్ ప్రవర్తించాడని తన నివేదికలో పేర్కొంది. అలాగే ఆయనపై ఐపీసీ 306, 498ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో జూలై 7న న్యాయస్థానం ముందు హాజరవ్వాలని ఢిల్లీ హైకోర్టు శశిథరూర్ను ఆదేశించింది.
అయితే శశిథరూర్ ఎంపీ అయినందున ఈ కేసును పార్లమెంట్ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ కోర్టుకు బదిలీ చేసింది. అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సునంద కేసును విచారిస్తారు. 2014 జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్లో సునంద ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై ఎన్నో అనుమానాలు తలెత్తాయి. నాలుగేళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం ఢిల్లీ పోలీసులు తుది నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు.