సుల్తాన్‌పూర్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 29, 2024, 7:31 PM IST
Highlights

బీవీ కేస్కర్ , గోవింద్ మాలవీయ, రాజ్ కరణ్ సింగ్ వంటి దిగ్గజాలు సుల్తాన్‌పూర్ నుంచి గెలుపొందారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చిన్న కోడలు మేనకా గాంధీ , మనవడు వరుణ్ గాంధీలు ఇక్కడ ఎంపీలుగా గెలిచారు. సుల్తాన్‌పూర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా వుండేది. హస్తం పార్టీ 8 సార్లు, బీజేపీ 5 సార్లు, బీఎస్పీ 2 సార్లు, జనతా పార్టీ, జనతాదళ్‌లు ఒక్కోసారి ఇక్కడ గెలుపొందాయి. ఈ లోక్‌సభ స్థానంలో షెడ్యూల్డ్ కులాల జనాభా 21.29 శాతం, షెడ్యూల్డ్ తెగల జనాభా 0.02 శాతం . సుల్తాన్‌పూర్ స్థానంలో ముస్లిం, రాజ్‌పుత్, బ్రాహ్మణ ఓటర్లు బలంగా వుండి అభ్యర్ధుల గెలుపొటములను నిర్దేశిస్తున్నారు. మేనకా గాంధీని బీజేపీ మరోసారి అభ్యర్ధిగా ప్రకటించింది. విపక్ష ఇండియా కూటమి తరపున సమాజ్‌వాదీ పార్టీ సుల్తాన్‌పూర్‌లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గాంధీ నెహ్రూ కుటుంబం పేరు చెప్పగానే కొన్ని నియోజకవర్గాలు టక్కున గుర్తొస్తాయి. అలాంటి వాటిలో సుల్తాన్‌పూర్ ఒకటి. హేమాహేమీలు ఇక్కడి నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. బీవీ కేస్కర్ , గోవింద్ మాలవీయ, రాజ్ కరణ్ సింగ్ వంటి దిగ్గజాలు సుల్తాన్‌పూర్ నుంచి గెలుపొందారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చిన్న కోడలు మేనకా గాంధీ , మనవడు వరుణ్ గాంధీలు ఇక్కడ ఎంపీలుగా గెలిచారు. 1952లో నియోజకవర్గం ఏర్పడిన తొలినాళ్లలో సుల్తాన్‌పూర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా వుండేది. హస్తం పార్టీ 8 సార్లు, బీజేపీ 5 సార్లు, బీఎస్పీ 2 సార్లు, జనతా పార్టీ, జనతాదళ్‌లు ఒక్కోసారి ఇక్కడ గెలుపొందాయి. 

సుల్తాన్‌పూర్ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. కాంగ్రెస్ కంచుకోట :

సుల్తాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఐసౌలి, సుల్తాన్‌పూర్, సుల్తాన్‌పూర్ సదర్, లంబువా, కడిపూర్ అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ నియోజకవర్గంలో 80 శాతం మంది హిందువులు, 20 శాతం మంది ముస్లిం ఓటర్లు వున్నారు. ఈ లోక్‌సభ స్థానంలో షెడ్యూల్డ్ కులాల జనాభా 21.29 శాతం, షెడ్యూల్డ్ తెగల జనాభా 0.02 శాతం . సుల్తాన్‌పూర్ స్థానంలో ముస్లిం, రాజ్‌పుత్, బ్రాహ్మణ ఓటర్లు బలంగా వుండి అభ్యర్ధుల గెలుపొటములను నిర్దేశిస్తున్నారు. 

ఈ సెగ్మెంట్ పరిధిలో బీజేపీ బలంగా వుంది. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సుల్తాన్‌పూర్ లోక్‌‌సభ పరిధిలోని 5 శాసనసభా స్థానాల్లో నాలుగు చోట్ల బీజేపీ గెలుపొందగా.. ఒకచోట బీఎస్పీ విజయం సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున మేనకా గాంధీ పోటీ చేశారు. ఆమెకు 4,59,196 ఓట్లు.. బీఎస్పీ అభ్యర్ధి చంద్ర భద్ర సింగ్‌కు 4,44,670 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా మేనకా గాంధీ 14,526 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

సుల్తాన్‌పూర్ ఎంపీ ( పార్లమెంట్ ) ఎన్నికల ఫలితాలు 2024 .. మరోసారి బరిలో మేనకాగాంధీ :

2024 లోక్‌సభ ఎన్నికల విషయానికి వస్తే.. ఇక్కడి నుంచి మేనకా గాంధీని బీజేపీ మరోసారి అభ్యర్ధిగా ప్రకటించింది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలన , రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అభివృద్ధి కార్యక్రమాలు, సుల్తాన్‌పూర్‌ సెగ్మెంట్ పరిధిలో బీజేపీ బలంగా వుండటంతో మరోసారి తన గెలుపు ఖాయమని మేనకా గాంధీ ధీమాగా వున్నారు. విపక్ష ఇండియా కూటమి తరపున సమాజ్‌వాదీ పార్టీ సుల్తాన్‌పూర్‌లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే అభ్యర్ధిని ప్రకటించనున్నారు. 

click me!