12 గంటలు.. 100 ప్రశ్నలు.. ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ

Published : Jul 27, 2022, 02:46 PM IST
12 గంటలు.. 100 ప్రశ్నలు.. ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ

సారాంశం

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణ ముగిసింది. నేషనల్ హెరాల్డ్ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆమెను మూడు రోజులు విచారించారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణ ముగిసింది. నేషనల్ హెరాల్డ్ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆమెను మూడు రోజులు విచారించారు. దాదాపు 12 గంటల పాటు సాగిన విచారణలో.. ఈడీ అధికారులు 100కి పైగా ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది. మంగళవారం సోనియా విచారణ అనంతరం.. ఆమె ప్రశ్నలకు వేగంగా సమాధానం చెబుతున్నట్టుగా ఈడీ వర్గాలు తెలిపాయి. ఇక, నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక, యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌లలో ఆమె ప్రమేయంపై సోనియా గాంధీని ప్రశ్నించారు. 

యంగ్ ఇండియన్‌లో మెజారిటీ వాటాదారులుగా ఉన్నందున.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాహుల్ గాంధీ చెప్పిన సమాధానాలతో సోనియా గాంధీ సమాధానాలను సరిపోల్చనుంది. ఇక, ఇదే కేసుకు సంబంధించి ఈడీ అధికారులు పలు దఫాలుగా రాహుల్ గాంధీని 5 రోజుల పాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రాహుల్‌ను ఈడీ అధికారులు దాదాపు 150 ప్రశ్నలు అడిగారు. 

మూడు రోజుల పాటు విచారణ..
ఈ కేసు సంబంధించి ఈ నెల 21న సోనియా తొలిసారిగా ఈడీ విచారణకు హాజరయ్యారు. తొలి రోజు రెండు గంటలకు పైగా ఈడీ అధికారులు సోనియాను ప్రశ్నించారు. తర్వాత మంగళవారం (జూలై 26) సోనియా గాంధీ మరోమారు ఈడీ విచారణకు హాజరయ్యారు. రెండో రోజు ఈడీ అధికారులు ఆరు గంటల పాటు సోనియాను ప్రశ్నించారు. ఇక, నేడు కూడా సోనియా విచారణకు హాజరుకాగా.. దాదాపు మూడు గంటల పాటు విచారణ సాగింది. 

అనంతరం సోనియా గాంధీ ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. అయితే ఈడీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఈ కేసులో సోనియా విచారణ ముగిసినట్టుగా తెలుస్తోంది. మరోమారు విచారణకు హాజరుకావాలని సోనియాకు ఈడీ అధికారులు ఎలాంటి సమన్లు జారీ చేయలేదని సమాచారం. మళ్లీ ఆమెకు సమన్లు జారీ చేస్తేనే విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. 

ఇక, సోనియా గాంధీని ప్రశ్నించిన మూడు రోజులలో ఆమె కూతురు ప్రియాంక గాంధీ కూడా తోడుగా ఈడీ కార్యాలయానికి వచ్చారు. సోనియా గాంధీ..  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెను ప్రశ్నిస్తున్న గది దూరంగా ఉన్న మరో గదిలో ఉండేందుకు అనుమతించారు. అదే సమయంలో వైద్య సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచారు.

ఇదిలా ఉంటే.. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకునేందుకు కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందని పలు ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. సోనియా గాంధీ ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu