
గువహతి: సక్కిం మాజీ సీఎం పవన్ చామ్లింగ్కు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం ఆయన అసెంబ్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతుండగా తన కాన్వాయ్పై కొందరు దుండుగులు రాళ్లు విసిరారు. ఈ రాళ్ల దాడుల్లో చాలా వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై మాజీ సీఎం పవన్ చామ్లింగ్ సీరియస్గా ఉన్నారు. ఈ ఘటనపై అదే రోజు మూడు ఫిర్యాదులు పోలీసులకు అందాయి. దీంతో పోలీసులూ హుటాహుటిన రంగంలోకి దిగారు. అదే రోజు రాత్రి పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
ఎస్డీఎఫ్ మద్దతు దారులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. సదర్ పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి నలుగురిని అరెస్టు చేశారు. సంజీవ్ గురుంగ్, జిగ్మా భుటియా, తెంజింగ్ భుటియా, నవీన్ ప్రధాన్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
ఇది ఎస్కేఎం పార్టీ పనే అని మాజీ సీఎం పవన్ చామ్లింగ్ ఆరోపించారు. ఎస్కేఎం పార్టీ నాయకత్వమే వారిని రెచ్చగొట్టి తమపై ఉసిగొల్పిందని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను రూలింగ్ పార్టీ కొట్టివేసింది.
మాజీ సీఎం పవన్ చామ్లింగ్ కాన్వాయ్పై రాళ్లు విసిరిన ఘటన వెంటనే అక్కడ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. అందులో ఎస్డీఎఫ్కు చెందిన ముగ్గురు సభ్యులూ ఉన్నారు. వారికి ప్రస్తుతం ఎస్టీఎన్ఎం హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు వివరించారు.
తమ కాన్వాయ్పై రాళ్లు విసిరేసిన ఘటన గురించి సిక్కిం రాష్ట్ర గవర్నర్ గంగా ప్రసాద్కు పవన్ చామ్లింగ్ వివరించి తెలియజేశారు. రాష్ట్రంలో ఎస్కేఎం ప్రభుత్వ పాలనలో లా అండ్ ఆర్డర్ అదుపులో లేదని ఆయన ఆరోపణలు చేశారు. వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, ఇటీవలే బిహార్ సీఎం నితీష్ కుమార్పైనా దాడి జరిగింది. క రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనవసరం లేదు. ఆయనను కలుసుకోవాలంటే కట్టుదిట్టమైన భద్రతను దాటిపోవాలి. అయితే, ముఖ్యమంత్రి కాపలాగా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు.. కార్యకర్తలు ఉన్నారు.. పోలీసులు ఉన్నారు.. అధికారులు ఉన్నారు.. వీరందరూ చూస్తుండగానే ముఖ్యమంత్రి పై దాడి చేశాడు ఓ వ్యక్తి. బీహార్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
వివరాల్లోకెళ్తే.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఓ వ్యక్తి దాడి చేశారు. ఆయన స్వగ్రామం భక్తియార్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ వ్యక్తి ఆయనపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. ఆ వీడియో దృశ్యాలను గమనిస్తే.. సీఎం నితీష్ కుమార్ను వేదికపై కొట్టేందుకు ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ దాడి నుంచి సీఎం క్షేమంగా తప్పించుకోగా, ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రిని కొట్టేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి వేదికపైకి వేగంగా అడుగులు వేస్తున్నట్లు వీడియోలో ఉంది. అయితే, వెంటనే ఆ వ్యక్తిని సీఎం భద్రతా సిబ్బంది ఈడ్చుకెళ్లారు.