
ముంబైకి చెందిన శివసేన ఎమ్మెల్యే రమేష్ లత్కే (52) దుబాయ్లో గుండెపోటుతో మరణించాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులు నిర్ధారించారు. ‘‘ రమేష్ లత్కే బుధవారం అర్థరాత్రి దుబాయ్లో మరణించాడు. అక్కడికి ఆయన తన కుటుంబంతో కలిసి వెళ్లాడు.’’ అని ఆ పార్టీ నాయకులు పీటీఐతో తెలిపారు.
రమేష్ లత్కే ముంబైలోని అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండుసార్లు శివసేన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి ముందు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) లో కార్పొరేటర్ గా పని చేశారు.
అయితే లత్కే మృతదేహాన్ని గురువారం ముంబైకి తీసుకొచ్చే అవకాశం ఉందని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. ‘‘ మేము అతని మృతదేహాన్ని తిరిగి తీసుకురావడానికి అవసరమైన ప్రక్రియను ప్రారంభించడంపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఇతర పార్టీ సీనియర్ నాయకులకు తెలియజేశాం. గురువారం మృతదేహాన్నితిరిగి తీసుకువస్తారని మేము ఆశిస్తున్నాము ’’ అని సేన కార్యకర్త తెలిపారు.
లట్కే మరణం పట్ల శివసేన పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది సంతాపం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో ఆయన నియోజకవర్గంలో ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలకు, ఆయనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. ‘‘ శ్రీ రమేశ్ లత్కే జీ మరణవార్త విని ఒక్క సారిగా దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన నిరంతర శక్తి. కోవిడ్ సమయంలో ఆయన అంకితభావంతో పని చేశారు. నియోజకవర్గంతో ఆయన అనుబంధం అపారమైనది. ఆయన త్వరగా వెళ్లిపోయారు. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి.’’ అని ఆమె ట్వీట్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే కూడా ఆయన మరణం పట్ల స్పందించారు. ‘‘ శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే ఆకస్మిక మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను ! కొన్ని నెలల క్రితం అంగ్నేవాడి జాతర కోసం కోకాన్కు విమానంలో ఆయనను కలిసిన విషయం నాకు గుర్తుంది. బరువు తగ్గినందుకు అతనిని నేను చాలా ప్రశంసించాను. అతను పార్టీలకు అతీతంగా స్నేహితుడు. ఈ విషయం నమ్మశక్యం కాదు లేదు ’’ అని ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో శరద్ పవార్ కు చెందిన ఎన్ సీపీ, కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడి అధికారం చేపట్టాయి.