మళ్లీ వస్తున్నా.. చిన్నమ్మ హింట్.. ‘ఆస్కార్ వస్తుందేమో కానీ.. పార్టీలో ప్లేస్ రాదు’

By telugu teamFirst Published Oct 16, 2021, 5:54 PM IST
Highlights

తమిళనాడు రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. అదీ ప్రతిపక్ష ఏఐఏడీఎంకే కేంద్రంగా పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. చిన్నమ్మ శశికళ మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని గట్టిగా ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ, ఏఐఏడీఎంకే మాత్రం ఆమెను ఆహ్వానించబోమని చెబుతున్నది.
 

చెన్నై: Tamilnadu రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. దివంగత సీఎం Jayalalita నెచ్చెలి VK Shashikala మళ్లీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పుట్టించడానికి సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇటీవలే ఆమె మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు పలుసార్లు హింట్ ఇచ్చారు. తాజాగా, మరోసారి అదే తరహా సంకేతాలనిచ్చారు. చెన్నైలో మెరీనాలోని జయలలిత మెమోరియల్‌కు వెళ్లి భావోద్వేగానికి లోనయ్యారు. జయలలిత సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. ఈ మెమోరియల్‌కు ఏఐఏడీఎంకే జెండా పెట్టిన కారులో ఆమె వెళ్లారు. ఈ నేపథ్యంలో జయలలిత సమాధి వద్దకు వెళ్లడం రాజకీయవర్గాల్లో చర్చకు తెరతీసింది.

అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఏఐఏడీఎంకేను మళ్లీ సంస్కరించి జవసత్వాలు అందించే శక్తి సామర్థ్యం తనకు ఉన్నదని వీకే శశికళ అన్నారు. తన జీవితంలో నాలుగింట మూడు వంతుల కాలాన్ని జయలలితతోనే కలిసి ఉన్నారని చిన్నమ్మ తెలిపారు. మెమోరియల్ సందర్శించి నాలుగేళ్లు గడుస్తున్నదని, ఏఐఏడీఎంకే క్యాడర్‌ను జయలలిత, ఎంజీఆర్ రక్షిస్తారని వివరించారు.

జయలలిత సమాధిని చిన్నమ్మ సందర్శించడం AIADMK రుచించలేదు. మళ్లీ politicsలోకి వస్తారని ఆమె ప్రకటించడాన్నీ తిరస్కరించింది. ‘ఏఐఏడీఎంకేలో శశికళకు స్థానం లేదు. అమ్మ సమాధి దగ్గరకు ఆమె వెళ్లడం రాజకీయంగా ప్రభావితం చేయదు. రాజకీయాల్లో ఆమెకు స్థానం ఉండాలంటే ఏఎంఎంకేనే సరైన చోటు. ఆమె నటనకు ఆమెకు ఆస్కార్ అవార్డు వరిస్తుందేమో కానీ, ఏఐఏడీఎంకేలో మాత్రం చోటు దక్కదు’ అని పార్టీ ప్రతినిధి, మాజీ మంత్రి డీ జయకుమార్ వివరించారు.

Also Read: సీఎం సంచలన నిర్ణయం.. నా కాన్వాయ్ కోసం ప్రజలను ఆపొద్దు.. కార్ల సంఖ్య సగానికి కుదింపు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ 2017లో అరెస్టయిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లు శిక్ష అనుభవించి అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమె రాష్ట్రంలోకి వచ్చారు. ఆమె మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, ఎన్నికల కంటే ముందు రాజకీయాలపై తనదైన ముద్ర వేస్తారని అందరూ అనుకున్నారు. పార్టీ కుచించుకుపోవడాన్ని ఎంతమాత్రం సహించబోనని ఆమె ఓ ప్రకటన చేసి తన వైఖరిని స్పష్టం చేశారు. కానీ, అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే మిత్రపక్షం బీజేపీ నేతల వ్యూహంతో శశికళ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. అంతేకాదు, ఎన్నికలకు ముందే ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

కానీ, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని చెబుతూ వస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలకు పార్టీ బలైపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారని ఆమె తరుచూ చెబుతున్నారు. ఆమె రాజకీయాల్లోకి రావడాన్ని ఏఐఏడీఎంకే నేత పనీర్‌సెల్వం సమర్థిస్తుండగా, పళనిస్వామి వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ చిన్నమ్మ, టీటీవీ దినకరణ్‌లు మళ్లీ పార్టీలోకి వస్తే తన స్థానానికే ముప్పు వస్తుందని పళనిస్వామి భయపడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

click me!