
Pakistan Bomb Blast : పాకిస్థాన్ ఆర్మీకి ఊహించని షాక్ తగిలింది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో చోటుచేసుకున్న బాంబు పేలుడులో ఏడుగురు పాకిస్థానీ సైనికులు మరణించగా, పలువురు గాయపడ్డారు. భద్రతా సిబ్బందిని తీసుకెళ్తున్న వాహనం దగ్గర ఈ పేలుడు సంభవించిందని స్థానిక పోలీసు అధికారి నవీద్ అహ్మద్ తెలిపారు. బాలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఈ దాడికి బాధ్యత వహించింది.
బలూచిస్తాన్లో పాకిస్థానీ సైనిక దళాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన మరో రెండు దాడులకు కూడా ఈ బిఎల్ఏ బాధ్యత వహించింది. ఈ దాడుల్లో కనీసం ఏడుగురు సైనికులు మరణించారని, పలువురు గాయపడ్డారని బలెచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది.
అయితే ఈ బాంబుదాడిని ఖండిస్తూ, పాకిస్థాన్లో శాంతి కోసం తమ ప్రాణాలను అర్పించిన భద్రతా దళాలను ప్రశంసించారు హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
పాకిస్థాన్లో తీవ్రమైన తిరుగుబాటుకు కేంద్రంగా ఉన్న బలూచిస్తాన్లో జరిగిన వరుస సంఘటనల్లో ఇది తాజాది. నిషేధించబడిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో సహా వివిధ వేర్పాటువాద సంస్థలు ఈ ప్రాంతంలో దాడులు చేస్తున్నాయి. 2019లో యునైటెడ్ స్టేట్స్ BLAను ఉగ్రవాద సంస్థగా వర్గీకరించింది.
ఈ దాడికి కేవలం ఒక రోజు ముందు బలూచిస్తాన్లోని కలాట్ జిల్లాలో ఒక వాహనంపై బాంబు దాడి జరిగింది... దీనిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఆ దాడికి ఎవరూ బాధ్యత వహించలేదు.