Kerala Blast: టిఫిన్ బాక్స్‌లో పేలుడు పదార్థాలు, ఉదయం 9.40 గంటలకు మొదటి పేలుడు!

Published : Oct 29, 2023, 03:09 PM IST
Kerala Blast: టిఫిన్ బాక్స్‌లో పేలుడు పదార్థాలు, ఉదయం 9.40 గంటలకు మొదటి పేలుడు!

సారాంశం

కేరళలో క్రిస్టియానిటీకి చెందిన ఓ గ్రూప్ మూడు రోజుల ఆధ్యాత్మిక కార్యక్రమాలను అక్టోబర్ 27వ తేదీ నుంచి కొచ్చిలో నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమాల చివరి రోజున అంటే ఈ రోజు ఆ కన్వెన్షన్ సెంటర్‌లో వరుస పేలుళ్లు జరిగాయి. టిఫిన్ బాక్స్‌లో పేలుడు పదార్థాలు ఉంచినట్టు, ఉదయం 9.47గంటలకు తొలి పేలుడు సంభవించినట్టు సమాచారం.  

తిరువనంతపురం: కేరళలో ఓ ప్రార్థన వేదిక వద్ద ఈ రోజు ఉదయం వరుస పేలుళ్లు జరిగాయి. తొలుత పెద్ద పేలుడు జరిగి.. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే కనీసం మరో రెండు పేలుళ్లు జరిగాయి. కొచ్చిలో జెహోవా విట్నెస్ అనే క్రిస్టియన్‌లోని ఒక శాఖ మూడు రోజులపాటు ప్రార్థనలను నిర్వహించింది. చివరి రోజున సెంట్రల్ హాల్‌లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరో 36 మంది గాయపడ్డారు.

పేలుడు జరిగిన సమయంలో ఆ కన్వెన్షన్ సెంటర్‌లో సుమారు 2000 మంది ఉన్నారు. తొలి పేలుడు ఉదయం 9.47 గంటలకు చోటుచేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అక్టోబర్ 27న మొదలైన ఈ మూడు రోజుల కార్యక్రమం ఆదివారం ముగియనుంది. చివరి రోజునే ఈ పేలుడు సంభవించింది.

ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్‌ను ఈ పేలుళ్లకు ఉపయోగించారని కేరళ పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఈ పేలుడు పదార్థాలను ఓ టిఫిన్ బాక్స్‌లో పెట్టినట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఎన్ఐఏ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ టీమ్ కూడా ఘటనా స్థలానికి చేరుతున్నది.

Also Read: కేరళలో బాంబు పేలుడు: ఒకరు మృతి, 20 మందికి గాయాలు

కలమస్సారి ఎంపీ హిబి ఎడెన్ మాట్లాడుతూ.. ‘అక్కడి నుంచి తరలించే ప్లాన్ చేశాం. కానీ, దట్టమైన పొగ కమ్ముకుంది. తొక్కిసలాట కూడా జరిగింది... ఒక పెద్ద బ్లాస్ట్ తర్వాత చిన్న పేలుళ్లు జరిగాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీల్ చేశారు’ అని వివరించారు.

ఈ ఘటన దురదృష్టకరం అని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తామని సీఎం పినరయి విజయన్ తెలిపారు. ప్రభుత్వ వైద్యారోగ్య సిబ్బంది అంతా తమ సెలవులనూ వదులుకుని డ్యూటికి రిపోర్ట్ చేయాలని హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ కోరారు. కాగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఘటన గురించి సీఎం పినరయి విజయన్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రానికి సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు.

19వ శతాబ్దంలో అమెరికాకు చెందిన క్రిస్టియన్ రిలీజియస్ గ్రూపే ఈ జెహోవా విట్నెస్సెస్. ఈ గ్రూపే కేరళలోని కొచ్చిలో మూడు రోజులపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. చివరి రోజున ఈ కన్వెన్షన్ సెంటర్‌లో పేలుళ్లు జరిగాయి.

పేలుడు సెంట్రల్ హాల్‌లో జరిగిందని, వెనుక హాల్‌లో ఉన్న ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అక్కడంతా దట్టంగా పొగ అలుముకుందని, ఒక మహిళ చనిపోయినట్టు కేకలు విన్నా అని ఆయన వివరించారు. పేలుడు జరగ్గానే అందరూ కేకలు పెడుతూ పరుగులు తీశారని తెలిపారు. ఆ కన్వెన్షన్ సెంటర్ నుంచి బయటకు పరుగెత్తడం మించి మరేమీ తనకు గుర్తు లేదని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?