ఆచారాల పేరిట మహిళపై అత్యాచారం.. దొంగ బాబాను అరెస్టు చేసిన పోలీసులు

By Mahesh KFirst Published Sep 12, 2022, 5:07 AM IST
Highlights

ముంబయిలో ఓ దొంగ బాబా ఓ యువతిపై పలుమార్లు రేప్ చేశాడు. ఆమె మైనర్‌గా ఉంటున్న కాలం నుంచే లైంగికదాడులు చేశాడు. అయితే, ఇటీవలే ఆమె ఇంట్లో చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ముంబయి: మహారాష్ట్రలో ఓ దారుణం వెలుగు చూసింది. మరో దొంగ బాబా బూటకం బయటపడింది. దైవ శక్తులు ఉన్నాయని నమ్మించి ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆచారాల పేరిట ఆమెను వంచించాడు. టీనేజీ వయసు నుంచి ఆమెను రేప్ చేశాడు. ఆ దొంగ బాబాపై నమ్మకంతో బాలిక తల్లిదండ్రులు రెండో ఆలోచన చేయలేదు.

58 ఏళ్ల దొంగ బాబా సురేశ్ కుమార్ రవీంద్ర నారాయణ్ అవస్తీ తనకు దైవ శక్తులు పూనుకున్నాయని చాలా మందిని నమ్మించాడు. ముందుగా గుడ్డిగా నమ్మిన కొందరు ఇతరులు అంటే.. వారు చెబితే నమ్మేవారికి ఈ దొంగ బాబా గురించి గొప్పగా చెప్పారు. చెప్పిన వారిపై నమ్మకంతో దొంగ బాబానూ వారు విశ్వసించారు. ఇలా దొంగ బాబా గురించి చాలా వరకు విశ్వాసం చాలా మందిలో బలపడింది. 

కొందరు నుంచి సురేశ్ కుమార్ రవీంద్ర నారాయణ్ అవస్తీ గురించి బాధిత కుటుంబానికి తెలియవచ్చింది. ఆయనకు పవిత్ర శక్తులు ఉన్నాయని పలువురు చెబితే విన్నారు. ఆ తర్వాత ఆ బాబా దగ్గరకు వారు వెళ్లారు.

ఆ దొంగ బాబా వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నాడు. ఆ కుటుంబానికి చెందిన టీనేజీ బాలికపై 2019 నుంచి లైంగికదాడికి పాల్పడ్డాడు. 2019లో ఆమె మైనర్. ఇప్పుడు మేజర్. అభ్యంతరకర ఫొటోలు ఎన్నో తీసి పెట్టుకున్నాడు. లైంగికంగా ఆమె పై దాడులను కొనసాగించాడు. తనకు లొంగకున్నా.. ప్రతిఘటించినా ఆ ఫొటోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడని వెర్సోవా పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తెలిపారు. 

అయితే, దొంగబాబా అరాచకాల గురించి ఆమె ఇటీవలే ఇంట్లో చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులకు దొంగ బాబా అసలు రూపం తెలియవచ్చింది. వెంటనే వారు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇచ్చారు.  

అవస్తీ ఐటీ ప్రొఫెషనల్. ఆదివారం నాడు అవస్తీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై పోక్సో సహా పలు చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

click me!