సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు.. ఆర్యన్ ఖాన్, ఆమీర్ ఖాన్, ఇంకా..: రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు

By Mahesh KFirst Published Oct 17, 2022, 5:32 PM IST
Highlights

బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ఆధారాల్లేకుండానే బాలీవుడ్ ప్రముఖులపై డ్రగ్స్ ఆరోపణలు చేశారు. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని నేరుగా చెప్పారు. ఆమీర్ ఖాన్ గురించి తనకు తెలియదని వివరించారు. 
 

న్యూఢిల్లీ: బాబా రాందేవ్ శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌లో భాగంగా ఆయన ఉత్తరప్రదేశ్‌లో మాట్లాడారు. ఇందులో బాలీవుడ్ ప్రముఖులను ఆయన ప్రస్తావించారు. శనివారం చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

‘షారూఖ్ ఖాన్ కొడుకు (ఆర్యన్ ఖాన్) డ్రగ్స్ పార్టీలో డ్రగ్స్ చేస్తూ దొరికాడు. ఆయన జైలుకు వెళ్లాడు. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు. ఆమిర్ ఖాన్ గురించి నాకు తెలియదు. ఈ యాక్టర్లు అందరి గురించి దేవుడికే తెలియాలి’ అని మొరదాబాద్‌లో భారీ సమావేశంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

‘ఎంత మంది సినీ స్టార్లు డ్రగ్స్ తీసుకుంటారో ఎవరికి తెలుసు. హీరోయిన్లు మరీ దారుణం. సినిమా పరిశ్రమలో ఎటు చూసినా డ్రగ్స్, రాజకీయాల్లోనూ డ్రగ్సే’ అని తెలిపారు.

‘ఎన్నికల్లో లిక్కర్‌ ను పంచుతారు. అందుకే భారత్ ఎలాంటి డ్రగ్ బానిసత్వం నుంచి అయినా సరే దూరంగా ఉండాలనే శపథం తీసుకోవాలి. ఇందుకోసం మేము అంతా కలిసి ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తాం’ అని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు.

బాబా రాందేవ్ ఈ ఆరోపణలు ఎలాంటి ఆధారాలు లేకుండానే చేశారు. కాగా, ఆయన పేర్కొన్న సెలెబ్రిటీల నుంచి కూడా ఈ అంశంపై ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. 

Also Read: అల్లోపతి డాక్టర్లపై ఆరోపణలు ఎందుకు?.. దానికి గ్యారంటీ ఇస్తాడా?: బాబా రాందేవ్‌పై సుప్రీం కోర్టు ఫైర్

షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను క్రూజ్ షిప్‌లో డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. అయితే, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే ఆయన ఎలాంటి అభియోగాలు లేకుండా కేసు నుంచి బయటపడ్డాడు. ఈ కేసులో 20 రోజులపాటు జైలులో గడిపిన తర్వాత ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించింది.

2020లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన తర్వాత కూడా బాలీవుడ్, డ్రగ్స్‌ ఆరోపణలపై దర్యాప్తు చేశారు. చాలా మంది సినిమా ప్రముఖులను ఈ కేసులో ప్రశ్నించారు.

click me!