మళ్లీ అమేథీ బరిలో రాహుల్ గాంధీ.. రాయ్ బరేలీ నుంచి ప్రియాంక.. ఈ స్థానాల ప్రత్యేకతలు ఇవే..

Published : Mar 06, 2024, 03:54 PM IST
మళ్లీ అమేథీ బరిలో రాహుల్ గాంధీ.. రాయ్ బరేలీ నుంచి ప్రియాంక.. ఈ స్థానాల ప్రత్యేకతలు ఇవే..

సారాంశం

రాహుల్ గాంధీ మళ్లీ తన పాత లోక్ సభ నియోజకవర్గం అమేథీ నుంచి బరిలో నిలవబోతున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. తన తల్లి స్థానమైన రాయ్ బరేలీ నుంచి పోటీలో ఉండబోతున్నారు. ఈ రెండు స్థానాలకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య విడదీయలేని సంబంధం ఉంది.

15 ఏళ్ల పాటు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన అమేథీ స్థానంలో మళ్లీ విజయకేతనం ఎగురవేయాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అమేథీ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ వెల్లడించారు. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. అదే రాష్ట్రంలోని రాయ్ బరేలీ నుంచి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల అరంగేట్రం చేయనున్నారు. ఆ స్థానం నుంచి చాలా ఏళ్ల పాటు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. 

ఓటింగ్ సమయంలో వేలికి పూసే సిరా ఎక్కడ తయారవుతుందో తెలుసా ? దాని ప్రత్యేకతలేంటంటే ?

ఉత్తరప్రదేశ్ లో 1967లో ఆవిర్భవించినప్పటి నుంచి అమేథీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ 1977లో తొలిసారి అమేథీ నుంచి పోటీ చేశారు. అయితే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత 1980లో ఆయన విజయం సాధించారు. కానీ 1981లో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన మరణానంతరం ఆయన అన్న రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించి 1981లో అమేథీ నుంచి పోటీ చేశారు. 1984, 1989, 1991లలో తిరిగి ఎన్నికయ్యారు.

రాజీవ్ సతీమణి సోనియాగాంధీ 1999లో అమేథీ నుంచి పోటీ చేశారు. అయితే, 2004లో వచ్చిన ఎన్నికల్లో ఆమె తన నియోజకవర్గాన్ని గతంలో తన అత్తామామలు ఫిరోజ్ గాంధీ, ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్ బరేలీకి మార్చారు. రాహుల్ గాంధీ 2004లో అమేథీలో పార్టీ పగ్గాలు చేపట్టి 2009, 2014లో తిరిగి విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో 55 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా ఉన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్- బీజేపీల మధ్య పొత్తు : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి టంగ్ స్లిప్.. వీడియో వైరల్

అమేథీ నుంచి కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ మరోసారి పోటీకి దిగితే అమేథీలో మరో ఆసక్తికర పోటీ నెలకొనే అవకాశం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో స్మృతి ఇరానీ తన నియోజకవర్గంలో రాహుల్ ను 55,120 ఓట్ల తేడాతో ఓడించారు. అయితే ఆ ఎన్నికల్లో వయనాడ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించడంతో రాహుల్ గాంధీ లోక్ సభలో అడుగుపెట్టారు. 

కాగా.. 2004 నుంచి సోనియా గాంధీ లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన రాయ్ బరేలీ స్థానంలో ఇప్పుడు కూతురు ప్రియాంక గాంధీ బరిలో నిలవబోతున్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు రాయ్ బరేలీ ఎంపీగా ఉన్న సోనియా గాంధీ.. గత నెలలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజస్థాన్ నుంచి ఆమె తొలిసారిగా పెద్దల సభలో అడుగుపెట్టారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

NDA సమావేశంలో చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన మోదీ | NDA Meeting 2026 | Asianet News Telugu
Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu