
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామాలపై రాహుల్ గాంధీ స్పందించారు. ట్విట్టర్లో ఆయన ఓ పోస్టు చేశారు. తాను భారతదేశ స్వరం కోసం పోరాడుతున్నానని తెలిపారు. ఇందుకోసం ఎంత వరకైనా వెళ్లడానికి సిద్దంగా ఉన్నానని పేర్కొన్నారు. ఇక, ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. 2019లో మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ డిఫమేషన్ కేసులో సూరత్ కోర్టు గురువారం ఆయనను దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల జైలు శిక్షను కూడా విధించింది. అయితే కోర్టు ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది.
ఈ తీర్పు వెలువడ్డ మరుసటి రోజే లోక్సభ సెక్రెటేరియట్ ఓ నోటిఫికేషన్లో రాహుల్పై అనర్హత వేటు వేస్తున్నట్టుగా వెల్లడించింది. అయితే అనర్హత వేటు కోర్టు తీర్పు వెలువడిన రోజు నుంచే అమల్లోకి వచ్చినట్టు ఆ నోటిఫికేషన్లో వెల్లడించింది. ఇక, ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళలోని వయానాడ్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి విజయం సాధించారు.
Also Read: రాహుల్పై అనర్హత వేటు: ఈరోజు రాజ్యాంగ ప్రజాస్వామ్యం కొత్త పతానాన్ని చూశాం.. బీజేపీపై మమత ఫైర్
Also Read: రాహుల్ గాంధీ ముందున్న దారులేమిటీ? 8 ఏళ్లు ఎన్నికలకు దూరమేనా? కోర్టులో పిటిషన్ వేస్తారా?
ఇక, లోక్సభ సెక్రెటేరియట్ నుంచి నోటిఫికేషన్లో.. కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని సూరత్ కోర్ట్ ఆఫ్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దోషిగా తేల్చడంతో ఆయనపై అనర్హత వేటు పడిందని పేర్కొన్నారు. ఈ అనర్హత మార్చి 23వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు వివరించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు.