నూతన సాగు చట్టాలను రద్దు (Farm laws repeal) చేస్తున్నట్టుగా ప్రధాని నిర్ణయం తీసుకోవడంతో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) రైతులకు అభినందనలు తెలిపారు. రైతులు చేపట్టిన సత్యాగ్రహం.. కేంద్ర ప్రభుత్వ అహంకారాన్ని తలదించేలా చేశారని రాహుల్ అన్నారు.
నూతన సాగు చట్టాలను రద్దు (Farm laws repeal) చేస్తున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నేడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువరు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. రైతులు విజయం సాధించారని.. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi).. రైతులు చేపట్టిన సత్యాగ్రహం.. కేంద్ర ప్రభుత్వ అహంకారాన్ని తలదించేలా చేశారని రాహుల్ అన్నారు. అన్యాయంపై సాధించిన ఈ విజయానికి రైతులందరికీ అభినందనలు తెలిపారు. జై హింద్, జై హింద్ కిసాన్ అని ట్వీట్ చేశారు.
అయితే ఈ సందర్భంగా ఆయన గతంలో తాను చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ ఏడాది జనవరిలో రాహుల్ మాట్లాడుతూ.. ‘నా మాటలు గుర్తుపెట్టుకోండి.. ప్రభుత్వం బలవంతంగానైనా ఈ చట్టాలను రద్దు చేస్తుంది’ అని పేర్కొన్నారు. పాత వీడియోను జత చేయడం ద్వారా.. ఆ రోజు చెప్పిన మాటలు.. ఇప్పుడు నిజమయ్యాయని రాహుల్ చెప్ప ప్రయత్నం చేశారు. ప్రస్తుతం Rahul Gandhi షేర్ చేసిన ఓల్డ్ ట్వీట్ తెగ వైరల్గా మారింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ట్విట్టర్లో స్పందించింది. అహంకారం వీగింది.. రైతులు గెలిచారు అని పేర్కొంది.
Also read: farm laws repeal: మూడు వ్యవసాయ చట్టాల రద్దు.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా రైతులకు అభినందనలు తెలిపారు. వారికి సెల్యూట్ చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. ‘ఈరోజు ప్రకాశ్ దివస్.. నేడు ఎంతో గొప్ప వార్త విన్నాం. మూడు చట్టాలు రద్దు చేయబడ్డాయి. 700 మందికి పైగా రైతులు అమరులయ్యారు. వారు చరిత్రలో నిలిచిపోతారు. వ్యవసాయాన్ని, రైతులను కాపాడేందుకు ఈ దేశంలోని రైతులు తమ జీవితాలను ఎలా పణంగా పెట్టారో రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయి. నా దేశ రైతులకు నేను సెల్యూట్ చేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
వారికి నా ప్రగాడ సానుభూతి.. మమతా బెనర్జీ
సాగు చట్టాల రద్దు చేయడం రైతుల విజయమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ‘క్రూరత్వానికి చలించకుండా అలుపెరగని పోరాటం చేసిన ప్రతి ఒక్క రైతుకు నా హృదయపూర్వక అభినందనలు.. ఇది మీ విజయం. ఈ పోరాటంలో తమ ఆత్మీయులను కోల్పోయిన ప్రతి ఒక్కరికీ నా ప్రగాఢ సానుభూతి’ అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
ఇక, శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. రాబోయే పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో (parliament winter session 2021) దీనిపై ప్రకటన చేస్తామని వెల్లడించారు. రైతులందరినీ క్షమాపణ కోరుతున్నట్టుగా మోదీ చెప్పారు. రైతులు ఆందోళన విరమించాలని కోరారు. కాగా, ఈ సాగు చట్టాలను రద్దు చేయాలని గత ఏడాది కాలంగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.