
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం మండిపడ్డారు. ప్రధాని మాటలకు, చేతలకు పొంతన లేదని ఆరోపించారు. ఖాదీపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. దేశం కోసం ఖాదీ, కానీ.. జాతీయ జెండాకు చైనా పాలిస్టర్ అని విమర్శించారు. ఎప్పటిలాగానే ప్రధాని మోడీ మాటలు, చేతలకు పొంతన కుదరడం లేదని ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా.. రాహుల్గాంధీ ఫ్లాగ్ కోడ్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కేంద్రం ఫ్లాగ్ కోడ్ని సవరించడాన్ని కూడా తప్పుపట్టారు. గతంలో యంత్రంతో తయారు చేయబడిన, పాలిస్టర్ జెండాలను ఉపయోగించడానికి అనుమతి ఉండేది కాదు. కేవలం నూలుతో వడికిన జాతీయ జెండాలను మాత్రమే వాడే వారు. కానీ.. ఇటీవల మోడీ ప్రభుత్వం.. జాతీయ జెండాను చేతితో చేసే నూలు లేదా యంత్రంతో తయారు చేసిన పత్తి /పాలిస్టర్/ ఉన్ని/ పట్టు ఖాదీని వినియోగించవచ్చని సవరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే గతంలో మిషన్తో చేసే పాలిస్టర్ జెండాలను ఉపయోగించేందుకు అనుమతించలేదనే విషయాన్ని గుర్తు చేశారు.
అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ఫ్రంట్ లో నిర్వహించిన ఖాదీ ఉత్సవ్ సందర్భంగా ప్రధాని మోడీ ఖాదీ గురించి మాట్లాడారు. స్వాతంత్య్రానంతరం ఖాదీని పట్టించుకోలేదని, అయితే ఇప్పుడు అది 'స్వయం సమృద్ధి భారత్'కు ప్రేరణగా మారుతుందని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఖాదీ లేదా హోమ్స్పన్ నాసిరంకంగా ఉత్పత్తిగా పరిగణించారని చెప్పారు. అంతేకాదు రానున్న పండుగల సీజన్లో ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను మాత్రమే బహుమతిగా ఇవ్వాలని ప్రజలను కోరారు కూడా. దీంతో రాహుల్ గాంధీ మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు.