
పంజాబ్లో ఎన్నికల వేళ Enforcement Directorate అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ (Charanjit Singh Channi) మేనల్లుడు భూపిందర్ సింగ్ (Bhupinder Singh Honey) హనీ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన ఇంటితో పాటు పంజాబ్లోని మరికొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉదయం సోదాలు జరిగాయి. అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్న కంపెనీలపై మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ దాడులు చేసిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 10 నుంచి 12 చోట్ల దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు.
అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో సంబంధాలు ఉన్న ఉన్న పలువురిని విచారిస్తున్నారు. అయితే ఈ దాడులకు కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల్లో తమను ఎదుర్కొలేకనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ దాడులకు పాల్పుడుతుందని ఆరోపించింది.
ఇక, కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించబడిన తర్వాత కాంగ్రెస్ను వీడిన అమరీందర్ సింగ్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఇసుక అక్రమ వ్యాపారంలో పాలుపంచుకున్నారని ఆరోపించారు. అటువంటి ఎమ్మెల్యేల గురించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా తెలియజేసినట్టుగా చెప్పుకొచ్చారు.
ఇక, పంజాబ్లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుండగా.. మార్చి 10న ఫలితాలను ప్రకటించనున్నారు.