గంగా నదిలో పతకాలు వేయడాన్ని రెజ్లర్లు విరమించుకున్నారు. అయితే, బ్రిజ్ భూషణ్ పై ఐదు రోజుల్లో చర్యలు తీసుకోవాలని అల్టిమేటం విధించారు.
న్యూఢిల్లీ: తమ మెడల్స్ను గంగా నదిలో వేస్తామన్న నిర్ణయాన్ని రెజ్లర్లు విరమించుకున్నారు. హరిద్వార్లో గంగా నదిలో తమ పతకాలను వేయడానికి వెళ్లారు. కానీ, అక్కడ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రైతు నేతలు, కాంగ్రెస్ నాయకులు, స్థానికులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇన్నేళ్ల కష్టార్జితం ఆ మెడల్స్ అని, వాటిని గంగపాలు చేయరాదని వారికి చెప్పారు. వీరి జోక్యంతో రెజ్లర్లు పునరాలోచించారు. గంగా నదిలో తమ పతకాలు వేసే నిర్ణయాన్ని విరమించుకున్నారు. వారి మెడల్స్ను రైతు నేత నరేశ్ తికాయత్కు అప్పజెప్పారు. హర్ కి పౌరి నుంచి వారు వెనుదిరిగారు.
ఈ నిర్ణయాన్ని విరమించుకుంటూ వారు ప్రభుత్వానికి ఐదు రోజుల డెడ్లైన్తో అల్టిమేటం విధించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై యాక్షన్ తీసుకోవాలని అల్టిమేటం విధించారు.
ఢిల్లీ నుంచి హరిద్వార్కు తమ పతకాలను గంగా నదిలో వేయడానికి వెళ్లే ప్రకటన చేసిన తర్వాత యూపీ పోలీసులు స్పందించారు. తాము ఆ రెజ్లర్లను ఆపబోమని స్పష్టం చేశారు.
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై వారు లైంగిక ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత ఆయన పై కేసు నమోదైంది.
Also Read: ఇండియా గేట్ దగ్గర నిరసనలకు అనుమతించం: రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులు
బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 23 నుంచి నిరసనకు దిగిన మన దేశ టాప్ రెజ్లర్లు ఈ రోజు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. తమ పతకాలను గంగా నదిలో కలిపేస్తామని, ఆ తర్వాత ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని చెప్పారు. తమ మెడల్స్ను గంగా నదిలో వేయడానికి హరిద్వార్ వెళ్లారు. మే 28వ తేదీన వారు అప్పటి నిరసన వేదిక జంతర్ మంతర్ నుంచి నూతన పార్లమెంటు వైపు కదులుతుండగా పోలీసుల అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆ నిరసన వేదికను తొలగించారు. అక్కడ మళ్లీ నిరసన చేయడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని రెజ్లర్లు చెప్పిన తర్వాత ఢిల్లీ పోలీసులు ఇండియా గేట్ వద్ద నిరసనలను అనుమతించబోమని చెప్పారు.