విద్యుత్ బకాయిలు పేరుకుపోతున్నాయి.. చెల్లించండి: రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని మోడీ సూచన

By Siva KodatiFirst Published Jul 30, 2022, 8:45 PM IST
Highlights

విద్యుత్ తయారీ, పంపిణీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బకాయిలు చెల్లించాలని సూచించారు ప్రధాని నరేంద్ర మోడీ. విద్యుత్ తయారీ పంపిణీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 2.5 లక్షల కోట్ల మేర వున్నాయని ప్రధాని పేర్కొన్నారు.
 

విద్యుత్ తయారీ, పంపిణీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బకాయిలు చెల్లించాలని సూచించారు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) . భారీగా బకాయిలు పేరుకుపోయాయన్నారు. విద్యుత్ తయారీ పంపిణీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 2.5 లక్షల కోట్ల మేర వున్నాయని ప్రధాని పేర్కొన్నారు. సబ్సిడీలో భాగంగా అందించిన రూ.75 వేల కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ కంపెనీలకు చెల్లించకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. 

అంతకుముందు శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ (ntpc) నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ సీజీఎం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి రంగంలో నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని ఉజ్వల భవిష్యత్తు కోసం పరుగులు పెడుతుందన్నారు. 70 వేల మెగావాట్ల సామర్థ్యంతో దక్షిణ భారతదేశానికీ వెలుగులు పంచుతూ... మరో 16 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం నూతన ప్లాంట్ నిర్మాణంలో ఉందని సునీల్ చెప్పారు. 

Also Read:పెద్దపల్లి జిల్లా: నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్‌‌ను ప్రారంభించిన మోడీ

మారుమూల గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయడంతో పాటు ప్రతి పౌరుడికి ప్రభుత్వ పథకాలను అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి పనికి కరెంటు తప్పనిసరైన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఈ మొబిలిటీ, హైడ్రోజన్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి రంగం సిద్ధమైందని ఆయన చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిరంగంలో రామగుండం ఎన్టీపీసీ కి ఉజ్వల భవిష్యత్తు ఉందని సునీల్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

అతి తక్కువ సమయంలో నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి కృషి చేసిన అధికారులను, కార్మికులను ఆయన అభినందించారు. డిజిటల్ ప్లాట్ ఫారంపై ప్రధాని మోడీ 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించిన సందర్భంగా అధికారులతో కలిసి సీజీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 
 

click me!