
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అమర్నాథ్లో శుక్రవారం చోటు చేసుకున్న వరదలపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు జమ్మూకాశ్మీర్ అధికారులకు ఫోన్ చేసిన ఆయన సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. మరోవైపు ఆ ప్రాంతంలో వాతావరణానికి సంబంధించి ఐఎండీ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇకపోతే హైదరాబాద్ గోషా మహాల్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రస్తుతం అమర్ నాథ్ యాత్రలోనే వున్నారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే వున్నట్లుగా తెలుస్తోంది.
కాగా.. ఆకస్మిక వరదల కారణంగా అమర్నాథ్ విలవిలలాడింది. శిబిరాల్లోకి వరద నీరు పోటెత్తడంతో భారీ సంఖ్యలో యాత్రికులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఇప్పటికు వరకు మరణించిన యాత్రికుల సంఖ్య పదికి చేరింది. వీరి మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. 40 మంది భక్తుల ఆచూకీ తెలియాల్సి వుందని అధికారులు చెబుతున్నారు. ప్రతికూల వాతావరణం, వరదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. బాధితులను తరలించేందుకు హెలికాఫ్టర్లు రంగంలో దిగాయి. అయితే భారీ వర్షం కారణంగా సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడింది.
ALso Read:ముంచెత్తిన వరద.. అమర్నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్
ఇకపోతే.. జూన్ 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొత్తం 43 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఆగస్టు 11న రక్షా బంధన్ రోజున అమర్ నాథ్ యాత్ర ముగియనుంది. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి యాత్ర సాగడం లేదు. చివరిసారిగా 2019 జూలై 1 నుంచి ఆగస్టు 1 వరకు యాత్ర జరిగింది. అప్పుడు 3.42 లక్షల మంది భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నారు.