మోడీ సీఎంల సమావేశంలో మన తెలుగు రాష్ట్రాలకు నో ఛాన్స్, ఎందుకంటే....

By Sree sFirst Published Apr 27, 2020, 9:55 AM IST
Highlights

లాక్ డౌన్ ను కొనసాగించాలా, ఎత్తేయాల అనేదానిపై నేడు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే!

భారతదేశంలో లొక్ డౌన్ విధించిన తరువాత దాన్ని పొడిగించారు కూడా. ఇప్పుడు ఆ పొడిగించిన లాక్ డౌన్ కూడా ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను కొనసాగించాలా, ఎత్తేయాల అనేదానిపై నేడు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే!

లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడడం ఇది నాలుగవ సారి. ఈ సారి మీటింగులో మన ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాట్లేడేందుకు ఛాన్స్ లేదు. కేవలం బీహార్, ఒడిశా, గుజరాత్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, మేఘాలయ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు మాత్రమే మాట్లాడడానికి అవకాశం దక్కనుంది. 

ఈ సారి అందరు ముఖ్యమంత్రులకు మాట్లాడడానికి అవకాశం ఇద్దామనుకున్నప్పటికీ కుదర్లేదన్నారు అధికారులు. గత పర్యాయం లాక్ డౌన్ పొడిగింపుపై సీఎంలు లిఖిత పూర్వక పత్రం అందజేయాల్సిన అవసరం ఉండడంతో .... అందరిని పిలవాల్సి వచ్చిందని, ఈ సారి అలాంటివేవీ అవసరం లేకపోవడంతో కొందరికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. 

కరోనా నియంత్రణతో పాటు లాక్‌డౌన్‌ అమలుపైనా చర్చింనున్నారు. దేశంలో కోవిడ్ 19 వెలుగులోకి వచ్చిన తర్వాత తొలుత మార్చి 20న ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని 24న లాక్‌డౌన్ ప్రకటించారు.

Also Read:ఢిల్లీలో లాక్‌డౌన్ సడలింపులు.. కేవలం వీటికి మాత్రమే: కేజ్రీవాల్ ప్రకటన

ఆ తర్వాత ఏప్రిల్ 11న రెండోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన వారి అభ్యర్ధన మేరకు లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు. ఈ క్రమంలో రెండో దశ లాక్‌డౌన్ ముగింపునకు గడువు సమీపిస్తుండటంతో దానిపై చర్చించే అవకాశం ఉంది.

లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేసే అంశంపై ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న రాష్టాలు మాత్రం మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలని కోరుతున్నాయి.

Also Read:క్యాంపులో వంటవాడికి పాజిటివ్: 14 మంది బీఎస్ఎఫ్ జవాన్లు క్వారంటైన్‌లోకి

కోవిడ్ పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే లాక్‌డౌన్ అమలు చేయాలని పలువురు ముఖ్యమంత్రులు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆదివారం మన్‌కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని... ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించాలని చెబుతూనే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రధాని లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా లేక దశలవారీగా ఎత్తేస్తారా అన్నదానిపై సోమవారం క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

click me!