Republic day 2022: నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రారంభించనున్న ప్రధాని.. గణతంత్ర వేడుకలు షురూ

By Mahesh KFirst Published Jan 23, 2022, 10:51 AM IST
Highlights

ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి. తొలిసారిగా మన దేశంలో ఈ రోజు నుంచే అంటే 23వ తేదీ నుంచి గణతంత్ర వేడుకలు ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈ విగ్రహాన్ని ప్రధాని మోడీ ప్రారంభిస్తారు.
 

న్యూఢిల్లీ: నేడు గణతంత్ర వేడుకలు(Republic Day Celebrations) ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏడాది జనవరి 24వ తేదీన ఈ వేడుకలు ప్రారంభం అవుతాయి. కానీ, ఈ సారి నేతాజీ జయంతి(Netaji Birth Anniversary) రోజునూ ఈ వేడుకల్లో కలిపారు. దీంతో నేతాజీ జయంతి నుంచే దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభం అవుతున్నాయి. అంటే దేశంలో తొలిసారిగా 23వ తేదీన ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు నేతాజీ 125వ జయంతి కావడంతో దేశవ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ తరుణంలో ప్రధాని మోడీ నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఈ రోజు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. నేతాజీ విగ్రహాన్ని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభించి గణతంత్ర వేడుకలను షురూ చేయనున్నారు.

దేశమంతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నదని, ఈ సందర్భంలో ఆయన విగ్రహాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నామన్న విషయాన్ని వెల్లడించడం సంతోషంగా ఉన్నదని ప్రధాని మోడీ వివరించారు. ఆయనకు దేశం ఎంతగా రుణపడి ఉన్నదో చెప్పడానికి ఇది సంకేతంగా ఉంటుందని ఆయన ఓ ట్వీట్‌లో తెలిపారు. ఐదో కింగ్ జార్జ్‌కు ఉపయోగించిన నిర్మాణం (ఛత్రం?) కింద నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ రోజు ఇన్‌స్టాల్ చేయనున్న నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని 30వేల ల్యూమెన్లు, 4కే ప్రొజెక్టర్‌తో ఏర్పాటు చేయనున్నారు. 90 శాతం పారదర్శకమైన హోలోగ్రాఫిక్ స్క్రీన్‌తో ఉంటుందని, విజిటర్లకు దాదాపు ఈ స్క్రీన్ కనిపించదని పీఎంవో తెలిపింది. ఆ స్క్రీన్‌పై నేతాజీ సుభాష్ చంద్రబోస్ 3డీ ఇమేజ్‌ను ప్రొజెక్ట్ చేసి హోలోగ్రామ్ ఎఫెక్ట్ క్రియేట్ చేయనున్నారని వివరించింది. ఈ హోలోగ్రామ్ స్టాచ్యూను త్వరలోనే 25 అడుగుల ఎత్తుతో గ్రానైట్‌ విగ్రహంతో రీప్లేస్ చేస్తారని పేర్కొంది.

ప్రధాని మోడీ ఈ రోజు నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కరాలనూ ప్రకటించనున్నారు. విపత్తు సమయంలో ఆదుకున్న వ్యక్తులు, సంస్థల సేవలను గుర్తించడానికి ఈ అవార్డులను ప్రకటించనున్నారు. 2019, 2020, 2021, 2022 సంవత్సరాల్లో చేసిన కృషికి గాను ఈ ఏడు అవార్డులను ప్రకటిస్తారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంగా నిర్వహించే బీటింగ్ రీట్రీట్‌(Beating Retreat)లో మహాత్ముడి(Mahatma Gandhi)కి ఎంతో ఇష్టమైన పాట ‘అబైడ్ విత్ మీ’(Abide With Me) ను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. అబైడ్ విత్ మీ అనేది ఒక క్రిస్టియన్ కీర్తన. ఈ ప్రేయర్‌ను స్కాటిష్ ఆంగ్లికన్ హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ 1847లో రాశారు. దీనికి విలియం హెన్రీ మాంక్ స్వరాలు సమకూర్చారు. ఈ పాట మహాత్మా గాంధీకి అమిత ఇష్టమైనది. ఈ పాటను 1950 నుంచి ప్రతి గణతంత్ర వేడుక బీటింగ్ రీట్రీట్‌లో ప్రదర్శిస్తుంటారు. గతేడాది తొలిసారిగా ఈ పాటను బీటింగ్ రీట్రీట్ నుంచి తొలగించారు. ఈ చర్యపై తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్లీ చేర్చారు. తాజాగా, మరోమారు ఈ పాటను కేంద్రం తొలగించింది.

click me!