
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్న ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. తాను హైదరాబాద్ చేరుకున్న విషయాన్ని మోదీ ట్వీట్ చేశారు. ‘‘బీజీపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు డైనమిక్ సిటీ హైదరాబాద్లో అడుగుపెట్టాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తాం’’ అని మోదీ పేర్కొన్నారు.
ఇక, బేగంపేట ఎయిర్పోర్టు నుంచి మోదీ ప్రత్యేక హెలికాప్టర్లో హెచ్ఐసీసీకి వెళ్లనున్నారు. హెచ్ఐసీసీ చేరుకున్న తర్వాత మోదీ తాను బస చేయనున్న నోవాటెల్కు చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హెచ్ఐసీసీ చేరుకుని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారు. ఈ సమావేశాల్లోనే రాత్రి 9 గంటల వరకు ఉంటారు. తిరిగి నోవాటెల్కు చేరుకుని.. అక్కడే బస చేయనున్నారు. మరుసటి రోజు అంటే ఆదివారం ఉదయం నేరుగా మళ్లీ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారు. ఉదయం 10 గంటలకు ఆయన హెచ్ఐఐసీకి చేరుకుంటారు. ఆదివారం ఆ సమావేశాల్లోనే సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటారు. అనంతరం ఆయన పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభలో పాల్గొనడానికి ముందు హోటల్లో కాసేపు బస చేస్తారు. నోవాటెల్లో విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం 5.55 గంటలకు ఆయన హెచ్ఐసీసీ నుంచి పరేడ్ గ్రౌండ్కు బయల్దేరుతారు.
అక్కడి నుంచి 35 నిమిషాల్లో మోదీ పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. సుమారు గంట సేపు ఆయన సభలోనే ఉంటారు. 7.30 గంటల వరకు ఆయన సభలో ఉండి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఆయన ఆదివారం రాత్రి రాజ్భవన్లో బస చేయనున్నారు. ఇక, సోమవారం ఉదయం ప్రధాని మోదీ హైదరాబాద్ నగరాన్ని విడిచి వెళతారు. 4వ తేదీ ఉదయం 9.20 గంటల కల్లా ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లనున్నారు.