
దేశ రాజధానిలో నిర్వహించిన India AI Impact Summit 2026 సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత దేశ కృత్రిమ మేథస్సు (AI) దిశను వివరించారు. గ్లోబల్ సౌత్లో ఈ స్థాయిలో నిర్వహించిన తొలి గ్లోబల్ AI సమ్మిట్ ఇదే కావడం ప్రత్యేకత. ఈ సమ్మిట్కు “సర్వజన హితాయ, సర్వజన సుఖాయ” అనే నినాదం ఇవ్వడం వెనుక స్పష్టమైన భావన ఉందని ప్రధాని చెప్పారు. సాంకేతికత అందరికీ మేలు చేయాలి, అందరికీ సంతోషం తీసుకురావాలనేది దీని అర్థం.
ప్రధాని మాటల్లో చెప్పాలంటే, AI మనిషి సామర్థ్యాలను విస్తరించగల శక్తి. కానీ సరైన దిశ లేకపోతే సామాజిక సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. అందుకే ఈ సమ్మిట్ను “ఇంపాక్ట్” అనే భావన చుట్టూ నిర్మించారు. కేవలం ఆవిష్కరణలు కాదు, సమాజానికి ఉపయోగపడే ఫలితాలపై దృష్టి పెట్టారు. ఈ ప్లాట్ ఫామ్ పై దేశాధినేతలు, మంత్రులు, టెక్నాలజీ నాయకులు, పరిశ్రమ ప్రతినిధులు కలిసి AI ద్వారా సమగ్ర అభివృద్ధి, ప్రజా వ్యవస్థల బలోపేతం, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై చర్చిస్తున్నారు.
భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయాణంలో AI కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని చెప్పారు.
ఆరోగ్యంలో:
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ట్యూబర్క్యులోసిస్, డయాబెటిక్ రెటినోపతి, ఎపిలెప్సీ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించడంలో AI ఉపయోగపడుతోంది.
విద్యలో:
ప్రాంతీయ భాషల్లో AI ఆధారిత వ్యక్తిగత పాఠశాల ప్లాట్ఫార్ములు గ్రామీణ విద్యార్థులకు ప్రత్యేక మార్గదర్శనం అందిస్తున్నాయి.
మహిళా సాధికారత:
అమూల్ సంస్థ AI ద్వారా లక్షలాది మహిళా పాడి రైతులకు గుజరాతీ భాషలో పశు ఆరోగ్యం, ఉత్పాదకతపై సూచనలు ఇస్తోంది.
వ్యవసాయంలో:
పంటల సలహాలు, మట్టీ విశ్లేషణ, వాతావరణ సమాచారం వంటి అంశాల్లో AI రైతులకు సహాయం చేస్తోంది. ప్రపంచం AI వల్ల విభేదాలు పెరుగుతాయని ఆందోళన పడుతున్న వేళ, భారత్ మాత్రం విభేదాలు తగ్గించే సాధనంగా దాన్ని ఉపయోగిస్తోందని ప్రధాని చెప్పారు.
AI వ్యవస్థల్లో లింగం, భాష, ఆర్థిక స్థితి ఆధారంగా పాక్షికత ఉండే ప్రమాదం ఉందని ప్రధాని గుర్తుచేశారు. భారత్ వంటి భిన్నత్వం ఉన్న దేశంలో ఇది మరింత సున్నితమైన విషయం. కేవలం ఆంగ్ల డేటాతో తయారైన AI గ్రామీణ ప్రజలకు ఉపయోగపడకపోవచ్చు. అందుకే ప్రాంతీయ భాషల్లో డేటా సేకరణ, విభిన్న సమాజాలను ప్రతిబింబించే డేటాసెట్లు, న్యాయం, సమానత్వంపై పరిశోధనలు వంటి చర్యలు తీసుకుంటున్నారు.
ఆధార్, యూపీఐ వంటి డిజిటల్ వ్యవస్థలు ప్రజలకు అందుబాటులో ఉన్న పబ్లిక్ మౌలిక సదుపాయాలుగా నిర్మించారు. ఇవి ఓపెన్, ఇంటరాపరబుల్ విధానంతో నిర్మించబడటం వల్ల కోట్ల మందికి పయోగపడుతున్నాయి.
ఈ పునాది మీద AIను జోడిస్తే సంక్షేమ పథకాల సరైన లబ్ధిదారుల గుర్తింపు, మోసాల నిరోధం, పట్టణ ప్రణాళిక, పారదర్శకత వంటి అంశాలు మెరుగుపడతాయి. భారత్ అనుభవం గ్లోబల్ సౌత్ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
భారత్ ఇంజినీరింగ్ ప్రతిభకు ప్రసిద్ధి. ఇప్పుడు లక్ష్యం — AI వినియోగదారుడిగా కాకుండా సృష్టికర్తగా మారడం. 2026–27 బడ్జెట్లో డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్ తయారీ, AI సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి రంగాలకు ప్రోత్సాహం పెంచారు. IndiaAI మిషన్ కింద స్టార్టప్లు, పరిశోధనా సంస్థలకు అధిక పనితీరు గల కంప్యూటింగ్ సదుపాయాలు అందిస్తున్నారు.
2030 నాటికి భారత IT రంగం 400 బిలియన్ డాలర్ల మార్కెట్గా మారే అవకాశముందని అంచనాలు చెబుతున్నాయి. AI ఈ రంగాన్ని భర్తీ చేయడం కాదు, రూపాంతరం చేస్తోంది. సేవలతో పాటు AI ఆధారిత ఉత్పత్తులు, ప్లాట్ఫార్ములు తయారు చేయడంపై దృష్టి పెడుతున్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సస్టైనబుల్ నగరాల కోసం నాలుగు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశారు.
డీప్ఫేక్ వీడియోలు, సైబర్ నేరాలు వంటి ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో AI జనరేట్ చేసిన కంటెంట్పై వాటర్మార్కింగ్ హానికర కృత్రిమ మీడియా తొలగింపు, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం వంటి చర్యలు తీసుకున్నారు. 2025లో IndiaAI Safety Institute ప్రారంభించారు. AI వినియోగంలో నైతికత, భద్రతకు ఇది ప్రత్యేక వ్యవస్థ.
AI ఉద్యోగాలు తీసుకుపోతుందనే భయం సహజమేనని ప్రధాని చెప్పారు. కానీ ప్రతి సాంకేతిక విప్లవం కొత్త ఉద్యోగాలను సృష్టించిందని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వం భారీ స్థాయిలో స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్, డిజిటల్ శిక్షణపై దృష్టి పెట్టింది. Stanford Global AI Vibrancy Index 2025లో భారత్ మూడో స్థానం సాధించడం యువత ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు.
“ప్రపంచంలో టాప్–3 AI సూపర్ పవర్గా భారత్ నిలవాలి. కేవలం వినియోగంలో కాదు, సృష్టిలో కూడా.” అని ప్రధాని స్పష్టం చేశారు. సార్వభౌమత్వం, సమగ్రత, ఆవిష్కరణ అనే మూడు స్తంభాలపై ప్రధాని దృష్టిసారించినట్లు తెలిపారు. భారతీయ AI మోడళ్లను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యం. కోట్లాది ఉద్యోగాలు సృష్టించే స్టార్టప్లను నిర్మించాలని సంకల్పం. AI మనిషి గౌరవాన్ని కాపాడే సాధనంగా ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు.