
భోపాల్: కర్ణాటక ఎన్నికలతో జోష్ మీదున్న కాంగ్రెస్.. ఈ ఏడాది చివరిలో జరగనున్న ఎన్నికలు జరగనున్న తెలంగాణ సహా రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్లపైనా ఫోకస్ పెట్టింది. మధ్యప్రదేశ్లో గెలిచి చేతులు కాల్చుకున్న కాంగ్రెస్ మరోసారి ఇక్కడ గెలిచి పటిష్ట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆరాటపడుతున్నది. ఇప్పటికే ఇక్కడ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్లో భాగంగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ దూసుకువెళ్లుతున్నది. కానీ, ఇక్కడ కాంగ్రెస్ క్యాంపెయిన్కు ఎదురుదెబ్బ తగిలింది.
కర్ణాటకలో అప్పటి బీజేపీ ప్రభుత్వం కమీషన్ల సర్కారు అని, 40 శాతం కమీషన్లు దండుకుంటున్నారని కర్ణాటక కాంగ్రెస్ ఉధృత ప్రచారం చేశారు. ఇందులో భాగంగానే పేటీఎంను పోలిన లోగోను పేసీఎంగా తయారు చేసి అప్పటి బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు బలంగా చేసింది. ఇదే ఐడియాను మధ్యప్రదేశ్లోనూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే, ఇక్కడ ఫోన్ పే లోగోను వాడుకుంటున్నారు. ఫోన్ పే అనే పేరు సహా కలర్ అంతా అంలాగే ఉంచి క్యూఆర్ కోడ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఫొటో చేర్చి కమీషన్ల ప్రభుత్వం అంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నది.
ఈ క్యాంపెయిన్ బలంగా సాగుతున్న తరుణంలో కాంగ్రెస్కు ఊహించని షాక్ ఎదురైంది. ఫోన్ పే కంపెనీ మధ్యప్రదేశ్ కాంగ్రెస్కు వార్నింగ్ ఇచ్చింది. ఫోన్ పే లోగోను థర్డ్ పార్టీ అది రాజకీయ అవసరాలకైనా, రాజకీయేతర అవసరాలకైనా అనుమతి లేకుండా వాడుకోవడాన్ని అభ్యంతరపడుతూ ఫోన్ పే కంపెనీ హ్యాండిల్ ట్వీట్ చేసింది. తాము ఏ పార్టీతోనూ, ఏ రాజకీయ ప్రచారంలోనూ భాగంగా లేమని స్పష్టం చేసింది.
ఫోన్ పే లోగో రిజిస్టర్డ్ ట్రేడ్మార్క్ అని పేర్కొంది. కాబట్టి, అక్రమంగా ఈ లోగోను వినియోగిస్తే న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాబట్టి, దయచేసి తమ బ్రాండ్ లోగో, కలర్ ఉపయోగించి రూపొందించిన పోస్టర్ల ను వెంటనే తొలగించాలని తాము మధ్యప్రదేశ్ కాంగ్రెస్కు విజ్ఞప్తి చేస్తున్నట్టు ట్వీట్ చేసింది.