ఉద్యోగికి కరోనా లక్షణాలు: ఆఫీసులను మూసేసిన పేటిఎం

By telugu teamFirst Published Mar 5, 2020, 8:41 AM IST
Highlights

ఇటలీ నుంచి తిరిగి వచ్చిన ఓ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో పేటీఎం నోయిడా, గురుగ్రామ్ ల్లోని కార్యాలయాలను మూసేసింది. అయితే, తమ సర్వీసులకు ఏ విధమైన అంతరాయం ఉండదని పేటీఎం ప్రకటించింది.

న్యూఢిల్లీ: ఓ ఉద్యోగికి కరోనావైరస్ లక్షణాలు కనిపించడంతో డిజిటల్ చెల్లింపుల వేదిక పేటిఎం గురుగ్రామ్, నోయిడాలోని తన కార్యాలయాలను మూసేయాలని నిర్ణయించింది. కనీసం రెండు రోజుల పాటు కార్యాలయాలను మూసేయాలని నిర్ణయించుకుంది. ఇటీవల ఇటలీకి వెళ్లి వచ్చిన ఉద్యోగికి కోవిడ్ 19తో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి.

కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన ఉద్యోగి జట్టు సభ్యులకు కంపెనీ ఓ ప్రకటనలో సూచించింది. శానిటైజింగ్ కోసం కార్యాలయాలను మూసేస్తున్నట్లు తెలిపింది. 

Also Read: కరోనా వైరస్ భయం: భార్యను బాత్రూంలో పెట్టి తాళమేసిన భర్త

ఇటీవల వెకేషన్ పై ఇటలీ వెళ్లి వచ్చిన తమ ఉద్యోగికి ఒకరికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయని, అతను తగిన చికిత్స తీసుకుంటున్నాడని, అతని కుటుంబ సభ్యులకు తాము పూర్తి సహకారం అందిస్తున్నామని పేటిఎం అధికార ప్రతినిధి చెప్పారు. 

ముందు జాగ్రత్త చర్యలుగా అతని టీమ్ మెంబర్స్ వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించినట్లు తెలిపారు. కార్యాలయాల్లో శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టడం వల్ల రెండు రోజుల పాటు ఇంటి నుంచి పనిచేయాలని ఉద్యోగులకు సూచించినట్లు కంపెనీ తెలిపింది. 

Also Read: రోజుల తరబడి కాదు.. ఇక కరోనాను క్షణాల్లో కనిపెట్టేయొచ్చు

అయితే, తమ రోజువారీ ఆపరేషన్స్ కు  ఏ విధమైన ఇబ్బంది ఉండదని, పేటీఎం సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు.

click me!