
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్పై కఠిన వైఖరి అవలంబించింది, దేశవ్యాప్తంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. లండన్లోని పాకిస్తాన్ హైకమిషన్ బయట భారతీయ విద్యార్థులు, ప్రవాస భారతీయులు శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టారు.
నిరసనలతో భయపడిన పాకిస్తాన్ నుంచి అభ్యంతరకర ప్రతిస్పందన వచ్చింది. హైకమిషన్ నుంచి బయటకు వచ్చిన పాకిస్తాన్ ఆర్మీ అధికారి ఒకరు.. వింగ్ కమాండర్ అభినందన్ టీ తాగుతున్న ఫోటోను చూపించి, గొంతు కోసినట్లు సంజ్ఞ చేశారు. ఈ నీచ చర్య భారతీయ సమాజంలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
లండన్లోని పాకిస్తాన్ హైకమిషన్ బయట గుమిగూడిన భారతీయ సమాజం, పాకిస్తాన్పై ఉగ్రవాదానికి సహకరిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు చేసింది. పహల్గాం దాడిలో మరణించిన 26 మంది అమాయకుల మృతికి సంతాపం తెలిపింది. భారత జెండాలు, బ్యానర్లు, ప్లకార్డులతో నిరసనకారులు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భారత్ మాతాకీ జై, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.
ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తుందని, భారత్లో అమాయకులపై దాడులు చేసేందుకు వారికి సహాయం చేస్తుందని నిరసనకారులు ఆరోపించారు. ఈ దారుణ ఘటనతో బ్రిటన్లోని భారతీయ సమాజం తీవ్ర దుఃఖంలో ఉందని ఒక నిరసనకారుడు అన్నారు. మా దుఃఖాన్ని, ఐక్యతను శాంతియుతంగా చాటడానికి ఈ నిరసన ఒక మార్గమని వారు తెలిపారు. భారత్, ఇజ్రాయెల్ రెండూ కూడా మతతత్వ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నందున యూదు సమాజం భారత్కు మద్దతుగా నిలిచిందని ఒక నిరసనకారుడు అన్నారు. పహల్గాం దాడిని ఇజ్రాయెల్లో హమాస్ జరిపిన దాడులతో పోల్చారు.