
exam stress: విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి పెరుగుతున్నదనీ, దీని కారణంగా ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా అధికం అవుతున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయామనీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై పరీక్షల కారణంగా ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని నిపుణులు పేర్కొంటున్నారు.
పరీక్షలు.. ఫలితాల ఒత్తిడి కారణంగా ఏటా దాదాపు 2500 మంది ఆత్మహత్య !
పరీక్షల ఒత్తిడి, ఫలితాల నేపథ్యంలో ప్రతి సంవత్సరం దాదాపు 2500 మంది విద్యార్థులు బలవంతంగా తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం.. ఒత్తిడి, పరీక్షలలో ఫెయిల్ కావడం వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 2500 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. 2014 నుండి 2020 మధ్య గత 7 సంవత్సరాలలో పరీక్షల వల్ల కలిగే ఒత్తిడి కారణంగా దేశంలో 12,582 మంది ప్రాణాలు తీసుకున్నారు.
60% కంటే ఎక్కువ ఆత్మహత్యలు ఈ 5 రాష్ట్రాల్లోనే..
పరీక్షల్లో వైఫల్యం కారణంగా దేశంలోని ఐదు రాష్ట్రాల్లో 60 శాతం కంటే అధికంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. NCRB డేటా 2020 ప్రకారం.. జార్ఖండ్ వంటి చిన్న రాష్ట్రంలో 325 ఆత్మహత్యలు జరిగాయి. ఈ దురదృష్టకర జాబితాలో మహారాష్ట్ర (287), కర్నాటక (287) సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి.
చిన్న నగరాల్లోనూ ఆత్మహత్యలు..
మెట్రో నగరాలు సాధారణంగా దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువ ఒత్తిడితో కూడుకున్నవిగా పరిగణించబడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 2020 సంవత్సరంలో 56 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, మిగిలిన మెట్రో నగరాల్లో బెంగళూరు (40), ముంబయి (29) కూడా గణనీయమైన సంఖ్యలో ఆత్మహత్యలు నమోదయ్యాయి. 2020లో సూరత్ నలుగురు, ధన్బాద్ లో 137, రాంచీలో 29 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.
విద్యార్థుల ఒత్తిడి దూరం చేసేందుకు "పరీక్ష పే చర్చ" !
జీవితాన్ని ఉత్సవంగా నిర్వహించుకోవడానికి పరీక్షల నుండి ఉత్పన్నమయ్యే ఒత్తిడిని చర్చించి, అధిగమించడానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విదేశాల నుండి కూడా ప్రధాని నరేంద్ర మోడీతో సంభాషించే విశిష్టమైన ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ - పరీక్షా పే చర్చా అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం, విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఈవెంట్ విజయవంతంగా నిర్వహిస్తోంది.
"పరీక్ష పే చర్చ 2022" -5వ ఎడిషన్లో పాల్గొని ప్రధాని మోడీ ద్వారా మార్గదర్శకత్వం వహించే అవకాశాన్ని పొందవలసిందిగా కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆహ్వానించారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన వార్షిక 'పరీక్ష పే చర్చ' కార్యక్రమంలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో సంభాషించనున్నారు. పరీక్ష మరియు ఒత్తిడికి సంబంధించిన ప్రశ్నల గురించి ప్రధాని మోడీ మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని అంతకుముందు ట్వీట్ చేశారు, "ఈ సంవత్సరం పరీక్షా పే చర్చ పట్ల ఉన్న ఉత్సాహం అసాధారణమైనది. లక్షలాది మంది ప్రజలు తమ విలువైన ఆలోచనలు మరియు అనుభవాలను పంచుకున్నారు. సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులందరికీ నేను ధన్యవాదాలు. ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నాను" అని ట్వీట్ చేశారు.