జూన్ 21 నుంచి ఫ్రీ వ్యాక్సినేషన్.. రంగంలోకి కేంద్రం, 44 కోట్ల డోసులకు ఆర్డర్

By Siva KodatiFirst Published Jun 8, 2021, 6:33 PM IST
Highlights

కరోనా వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వం తన చెప్పుచేతల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇకపై రాష్ట్రాలు టీకా కోసం పైసా  కూడా ఖర్చు  పెట్టనక్కర్లేదని నిన్న ప్రధాని మోడీ జాతినుద్దేశిస్తూ ప్రకటించారు.

కరోనా వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వం తన చెప్పుచేతల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇకపై రాష్ట్రాలు టీకా కోసం పైసా  కూడా ఖర్చు  పెట్టనక్కర్లేదని నిన్న ప్రధాని మోడీ జాతినుద్దేశిస్తూ ప్రకటించారు. ఈ క్రమంలో జూన్ 21 నుంచి దేశంలో 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా టీకాలు వేయాలని కేంద్రం నిర్ణయించింది. కరోనాపై పోరాటంలో సార్వత్రిక వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని చేరుకొనేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. 

దీనిలో భాగంగా 44 కోట్ల డోసులకు పైగా ఆర్డర్‌ చేసినట్టు కేంద్రం ప్రకటించింది. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాల కోసం మంగళవారం భారీగా ఆర్డర్లు ఇచ్చింది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు 25 కోట్లు, భారత్‌ బయోటెక్‌‌కు 19 కోట్ల డోసులకు ఆర్డర్‌ ఇచ్చింది. మొత్తంగా ఈ 44 కోట్ల టీకా డోసులు డిసెంబర్‌ కల్లా అందుబాటులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. టీకాల సేకరణ కోసం ఈ రెండు సంస్థలకు అదనంగా 30 శాతం అడ్వాన్సు విడుదల చేసినట్టు వెల్లడించింది.   

Also Read:కరోనా ఉచిత వ్యాక్సినేషన్: కేంద్రం కొత్త గైడ్‌లైన్స్

మరోవైపు, కార్బివాక్స్‌ టీకా 30 కోట్ల డోసుల కోసం బయోలాజికల్‌ -ఇ సంస్థకు ఆర్డర్‌ ఇచ్చామని.. ఇది సెప్టెంబర్‌ కల్లా అందుబాటులోకి వస్తుందని నీతిఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్‌ తెలిపారు. కేంద్రం లెక్కల ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1.19 కోట్ల టీకా డోసులు పంపిణీకి సిద్ధంగా వున్నాయి. ఇప్పటివరకు 24 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్రాలకు పంపిణీ చేయగా.. వీటిలో 23.47 కోట్ల డోసులు వినియోగం (వృథాతో కలిపి) జరిగినట్టు తెలిపింది.

click me!