పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో ఉగ్రవాదులకు చెందిన లాంచింగ్ ప్యాడ్స్ కూడా ధ్వంసమయ్యాయి.
Operation Sindoor: పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు చేసి ధ్వంసం చేసింది. వీటిలో చాలా లాంచింగ్ ప్యాడ్లు ఉన్నాయి. వీటిని ఉగ్రవాదులు భారత్లోకి చొరబాటుకు వాడేవారు. అలాంటిదే సర్జల్ లేదా తెహ్రా కలాన్ ఫెసిలిటీ. జైష్-ఎ-మొహమ్మద్ (JeM)కి చెందిన ఈ లాంచింగ్ ప్యాడ్ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని నరోవాల్ జిల్లాలోని షకర్గఢ్లో ఉంది.
జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదుల చొరబాటుకు తెహ్రా కలాన్ ప్రధాన లాంచింగ్ సైట్. ఈ లాంచింగ్ ప్యాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఉంది. పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ISI, IB (అంతర్జాతీయ సరిహద్దు), LoC దగ్గర ఆసుపత్రి లాంటి ప్రభుత్వ భవనాల్లో లాంచింగ్ ప్యాడ్లను నిర్మించింది. జైష్-ఎ-మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన చాలా లాంచింగ్ ప్యాడ్లు ఆసుపత్రిలో ఉన్నాయి.
అంతర్జాతీయ సరిహద్దు నుంచి సుమారు 6 కి.మీ. దూరంలో సర్జల్ లాంచింగ్ ప్యాడ్ ఉంది. సరిహద్దు దాటి సొరంగాలు తవ్వడానికి ఇది స్థావరంగా ఉంది. షకర్గఢ్ ప్రాంతంలో ISI, JeM భూగర్భ సొరంగాల నెట్వర్క్ను అభివృద్ధి చేశాయి. దీన్ని భారత్లోకి జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాదుల చొరబాటుకు వాడుతున్నారు.
డ్రోన్ లాంచింగ్ స్థావరంగా కూడా సర్జల్ లాంచింగ్ ప్యాడ్ను వాడుతున్నారు. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మాదకద్రవ్యాలను భారత భూభాగంలోకి పంపుతున్నారు. ఇవి భారత్లోని ఉగ్రవాదులకు చేరుతున్నాయి. సర్జల్ లాంచింగ్ ప్యాడ్లో కంట్రోల్ రూమ్ కూడా ఉంది. ఇందులో JeM, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు వాడుతున్న HF రేడియో రిసీవర్, ఇతర కమ్యూనికేషన్ సదుపాయాలు ఉన్నాయి. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్లో చురుగ్గా ఉన్న ఉగ్రవాదులకు ఎన్క్రిప్టెడ్ మోడ్లో సందేశాలు పంపుతున్నారు.
సర్జల్ లాంచింగ్ ప్యాడ్ దగ్గర ఒక అంతస్తు భవనాలు ఉన్నాయి. వీటిలో ముందు గేటు దగ్గర 6/7 గదులు ఉన్నాయి. వీటిని PHC వైద్యులు, సిబ్బంది ప్రజలకు చికిత్స చేయడానికి వాడుతున్నారు. పార్కింగ్, హాలు దగ్గర ఉన్న రెండు క్వార్టర్స్ను JeM తన ఆపరేషనల్ కమాండర్లు, క్యాడర్ల కోసం వాడుతోంది. భారత్లోకి చొరబాటు ప్రయత్నాలు, చొరబాటుదారుల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సాధారణంగా 20-25 మంది JeM ఉగ్రవాదులు ఇక్కడ ఉంటారు.
JeM ఉగ్రవాద కమాండర్ మొహమ్మద్ అద్నాన్ అలీ అలియాస్ డాక్టర్, కాశిఫ్ జాన్ ఇక్కడికి క్రమం తప్పకుండా వస్తుంటారు. JeM చీఫ్ ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్ ఈ స్థావరంలో ఉన్న JeM గూఢచారుల ద్వారా కార్యకలాపాలను పర్యవేక్షిస్తాడు.
2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్పై జరిగిన ఉగ్రదాడిని ప్లాన్ చేసి, అమలు చేసిన JeM ప్రధాన ఆపరేటర్, కుట్రదారుడు అలీ జాన్ అలియాస్ కాశిఫ్ జాన్. పఠాన్కోట్ ఉగ్రదాడి సమయంలో కాశిఫ్ జాన్ ఫోన్లో ఉగ్రవాదులకు నిరంతరం మార్గనిర్దేశం చేశాడు. దాడిని అమలు చేయడానికి వారిని ప్రోత్సహించాడు, మార్గనిర్దేశం చేశాడు.
2023లో మరణించిన షాహిద్ లతీఫ్ JeM లాంచింగ్ కమాండర్. 2016లో పఠాన్కోట్ ఎయిర్బేస్పై దాడి చేయడానికి అతను ఉగ్రవాదులను పంపాడు. అతను సర్జల్ లాంచింగ్ ప్యాడ్ నుంచి కూడా పనిచేసేవాడు.