
బీజేపీ అధికార ప్రతినిధి నూపర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను బేషరుతుగా ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని చెప్పారు. జ్ఞాన్ వ్యాపిపై చర్చ సందర్భంగా ఆమె మహమ్మద్ ప్రవక్తపై కామెంట్స్ చేశారు. ఇవి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. దీనికి నిరసన తెలియజేస్తున్న సమయంలోనే యూపీలోని కాన్పూర్ లో రెండు వర్గాల మధ్య మత ఘర్షణ జరిగింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిందని తెలిసిందే.
నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల వల్ల ముస్లిం వర్గాల నుంచి నిరసనలు వ్యక్తం కావడం వల్ల ఆమెను పార్టీ నుంచి స్పస్పెండ్ చేశారు. అరబ్ దేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ పరిమాణాల నేపథ్యంలో ఆమె వెనక్కి తగ్గారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు. ‘‘ మా మహదేవ్ గత కొంత కాలంగా అవమానరంగా, అగౌరవంగా మాట్లాడటాన్ని నేను సహించలేకపోయాను. దీంతో నేను కొన్ని విషయాలు మాట్లాడాను. ఒకవేళ నా మాటల వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతింటే, ఎవరి మతపరమైన భావాలనైనా నేను గాయపరిచినట్లయితే, ఈ ప్రకటన ద్వారా నేను బేషరతుగా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటాను. ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీయాలనేది నా ఉద్దేశం కాదు ’’ అని శర్మ పేర్కొన్నారు.
మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. అరబ్ దేశాల్లో ఆగ్రహావేశాలు.. భారత దూతకు ఖతర్ సమన్లు
ముహమ్మద్ ప్రవక్త విషయంలో నూపుర్ శర్మ మాట్లాడిన తీరుపై ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. ‘‘ పార్టీ వైఖరికి విరుద్ధంగా అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు బీజేపీ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ (సీడీసీ) శర్మను సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు నూపర్ శర్మను బాధ్యతల నుంచి తక్షణమే తప్పిస్తున్నాం ’’ అని సీడీసీ సభ్య కార్యదర్శి ఓం పాఠక్ తెలిపారు.
అలాగే ఇలాంటి వ్యాఖ్యలే చేసిన ఢిల్లీ మీడియా హెడ్ నవీన్ కుమార్ జిందాల్ ను కూడా బీజేపీ బహిష్కరించింది. దీనిపై జిందాల్ కూడా సంజాయిషీ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఏ కుల, మతపరమైన మనోభావాలను దెబ్బతీసే లక్ష్యంతో లేవని ఆయన అన్నారు. కాగా అంతుకు ముందు రోజు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ మేము అన్ని మతాలను గౌరవిస్తున్నాం. ఏ మతానికి చెందిన ప్రముఖులనైనా అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా మతాన్ని లేదా మతాన్ని అవమానించే లేదా కించపరిచే ఏ భావజాలాన్ని అయినా బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాంటి వారిని, తత్వశాస్త్రాన్ని బీజేపీ ప్రోత్సహించదు ’’ అని పేర్కొంది.
అయితే నూపర్ శర్మ సస్పెన్షన్ పై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, ఎన్ సీ నాయకుడు ఒమర్ అబ్దుల్లా స్పందిచారు. నూపర్ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా అరబ్ దేశాల నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలోనే బీజేపీ ఇలా చేసిందని అన్నారు. ఇది కేవలం ఆయా దేశాలను చల్లబర్చడానికి మాత్రమే తీసుకున్న చర్యలని ఆరోపించారు. మతాలను, మత ప్రముఖులను అవమానించిన వారి పట్ల బీజేపీ ఇలా ఆకస్మాత్తుగా మేల్కొందని అన్నారు. భారత్ లోని లక్షలాది మంది ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నందుకు బీజేపీ నూపుర్ శర్మను సస్పెండ్ చేయలేదని, కేవలం అరబ్ దేశాలను శాంతింపజేయడమే ఆ ప్రకటన ఉద్దేశం అని తెలిపారు.