
లోక్సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన విపక్ష నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ చురకలంటించారు. మణిపూర్పై అర్ధవంతమైన చర్చ జరిపే ఉద్దేశం విపక్షాలకు లేదన్నారు. వీళ్ల చర్చలో అసలు విషయమే లేదంటూ మోడీ ఎద్దేవా చేశారు. మేం చర్చకు ఆహ్వానించాం.. కానీ విపక్షాలు చర్చలకు రావడం లేదన్నారు. మణిపూర్పై చర్చ విపక్షాలకు అవసరం లేదన్నారు.
మేడిన్ ఇండియా వ్యాక్సిన్ తయారైనా .. భారత్ వ్యాక్సిన్పై విపక్షాలకు నమ్మకం లేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. మేకిన్ ఇండియా అంటే ఎగతాళి చేశారని ఫైర్ అయ్యారు. 2028 నాటికి భారత ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడో స్థానంలో వుంటుందన్నారు. కశ్మీర్పై, కశ్మీర్ పౌరులపై కాంగ్రెస్కు నమ్మకం లేదని మోడీ ఫైర్ అయ్యారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని.. కాంగ్రెస్కు అహంకారంతో కళ్లు మూసుకుపోయాయని ధ్వజమెత్తారు.
Also Read: అవిశ్వాసం మాకు అదృష్టం.. 2018లోనూ ఇంతే, 2019లో ఏమైంది : విపక్షాలకు మోడీ కౌంటర్
త్రిపురలో 1988లో చివరిసారి కాంగ్రెస్కు అధికారం దక్కిందని.. యూపీ, బీహార్లోనూ కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరించారని మోడీ ఎద్దేవా చేశారు. నాగాలాండ్లో 1988లో చివరిసారిగా కాంగ్రెస్ గెలిచిందని.. తమిళనాడులో 1962లో చివరిసారిగా గెలిచిందని ప్రధాని చురకలంటించారు. కాంగ్రెస్పై అన్ని రాష్ట్రాల ప్రజలు నో కాన్ఫిడెన్స్ ప్రకటించారని మోడీ సెటైర్లు వేశారు. విపక్షాలు ఇండియాను I.N.D.I.Aగా ముక్కలు చేశాయన్నారు.
NDAలో రెండు ‘‘ I ’’లు చేర్చారని .. మొదటి I అంటే 26 పార్టీల అహంకారమని, రెండవ I అంటే ఒక కుటుంబ అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రతీ పథకం పేరు వెనుక కాంగ్రెస్ ఒక కుటుంబం పేరు చేర్చిందని ఎద్దేవా చేశారు. కానీ అక్కడ స్కీమ్లు లేవని, అన్నీ స్కామ్లేనని మోడీ దుయ్యబట్టారు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు గాంధీ పేరును వాడుకున్నారని ప్రధాని ఆరోపించారు. విపక్షాలది ఇండియా కూటమి కాదని, అది ఘమండియా కూటమిగా మోడీ అభివర్ణించారు.