
కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. కార్తీపై నమోదైన కొత్త కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్టుగా సమాచారం. 50 లక్షల రూపాయల లంచం తీసుకుని పంజాబ్లోని తల్వాండి సబో పవర్ లిమిటెడ్ ప్రాజెక్ట్ కోసం చైనా కార్మికులకు వీసాలు కల్పించడంలో కార్తీ చిదంబరం ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే కొత్త కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు నేడు సోదాలు చేపట్టారు.
ఇక, కార్తీ కుటుంబానికి చెందిన మొత్తం 7 చోట్ల సోదాలు జరుగుతున్నట్టుగా తొలుత వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచాం ప్రకారం.. తమిళనాడులో మూడు, ముంబైలో మూడు, పంజాబ్లో ఒకటి, కర్ణాటకలో ఒకటి, ఒడిశాలో ఒకటి సహా తొమ్మిది చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఇక, సోదాలు జరుపుతున్న ప్రాంతాల్లో కార్తీ చిదంబరం తండ్రి, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం నివాసం కూడా ఉంది. అయితే ఢిల్లీలోని కార్తీ నివాసంపై సీబీఐ సోదాలు జరుపుతున్నట్టుగా ప్రచారం జరిగిన.. అక్కడ అధికారులు సోదాలు జరపడం లేదని తేలింది.
‘‘పంజాబ్లోని మాన్సాలోని పవర్ ప్రాజెక్ట్లో పని చేసేందుకు వీలుగా చైనా పౌరులకు దాదాపు 260 వీసాలు కల్పించినందుకు చిదంబరం రూ. 50 లక్షలు పొందారనే ఆరోపణలు ఉన్నాయి’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి పేర్కొన్నట్టుగా ఓ ఆంగ్ల మీడియా తెలిపింది. ఇక, చిదంబరం.. 2008 నుంచి 2012 వరకు కేంద్ర హోం మంత్రిగా పనిచేశారు. ఇక, వీసాల జారీ అనేది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి.
ఇక, సీబీఐ తాజాగా తన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేయడం స్పందించిన కార్తీ.. వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇలా ఎన్నిసార్లు జరిగిందో లెక్క మరిచిపోయానని అన్నారు. ఇది ఒక రికార్డు అయి ఉంటుంది అని ట్వీట్ చేశారు.
కార్తీ చిదంబరం.. రూ. 305 కోట్ల మేరకు విదేశీ నిధులను స్వీకరించడానికి ఐఎన్ఎక్స్ మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అనుమతికి సంబంధించి అనేక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలో చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇక, 2017 మే 15న ఐఎన్ఎక్స్ మీడియాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. ఈ క్రమంలోనే సీబీఐ.. కార్తీ చిదంబరంను 2018 ఫిబ్రవరిలో అరెస్టు చేసింది. అయితే ఒక నెల తర్వాత మార్చిలో అతనికి బెయిల్ లభించింది.