
కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నై, ఢిల్లీ, ముంబై, శివగంగై ప్రాంతాల్లోని కార్తీ చిదరంబరం కుటుంబానికి చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.మొత్తంగా ఏడుచోట్ల సోదాలు జరుగుతున్నాయి. అయితే సీబీఐ దాడులపై స్పందించిన కార్తీ.. ఇలా ఎన్నిసార్లు జరిగిందో లెక్క మరిచిపోయానని అన్నారు. ఇది రికార్డు అయి ఉంటుంది అని ట్వీట్ చేశారు.
అయితే సోదాల విషయానికి వస్తే.. పంజాబ్లోని Talwandi Sabo Power ప్రాజెక్ట్కు సంబంధించి చైనా కార్మికులకు వీసాలు ఇప్పించడంలో కార్తీ ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి సీబీఐ.. కార్తీపై కొత్త కేసు నమోదు చేసినట్టుగా సమాచారం.
కార్తీ చిదంబరం.. రూ. 305 కోట్ల మేరకు విదేశీ నిధులను స్వీకరించడానికి ఐఎన్ఎక్స్ మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అనుమతికి సంబంధించి అనేక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలో చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇక, 2017 మే 15న ఐఎన్ఎక్స్ మీడియాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. ఈ క్రమంలోనే సీబీఐ.. కార్తీ చిదంబరంను 2018 ఫిబ్రవరిలో అరెస్టు చేసింది. అయితే ఒక నెల తర్వాత మార్చిలో అతనికి బెయిల్ లభించింది.