
మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై, ఢిల్లీ, ముంబై, శివగంగై ప్రాంతాల్లోని చిదరంబరంకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. చిదంబరం కొడుకు కార్తీ చిదంబరంపై నమోదైన కేసులకు సంబంధించి సీబీఐ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. మొత్తం 7 ప్రాంగణాల్లో సోదాలు జరుగుతున్నట్టుగా ఆ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో కూడా చిదరంబరం, కార్తీ చిదంబరం నివాసం, కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేసిన సంగతి తెలిసిందే.
ఐఎన్ఎక్స్ కేసు విచారణ సమయంలో కార్తీకి సంబంధించిన అంతర్గత, బాహ్య లావాదేవీలకు సంబంధించిన కొన్ని పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే పంజాబ్లోని Talwandi Sabo Power ప్రాజెక్ట్కు సంబంధించి చైనా కార్మికులకు వీసాలు ఇప్పించడంలో కార్తీ ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది. అయితే సీబీఐ సోదాల నేపథ్యంలో కార్తీ చిదంబరం ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలా ఎన్నిసార్లు జరిగిందో లెక్క మరిచిపోయానని అన్నారు. ఇది రికార్డు అయి ఉంటుంది అని ట్వీట్ చేశారు. ఇక, కార్తీ చిదరంబం ప్రస్తుతం తమిళనాడులోని శివగంగ నుంచి ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
కార్తీ చిదంబరం.. రూ. 305 కోట్ల మేరకు విదేశీ నిధులను స్వీకరించడానికి ఐఎన్ఎక్స్ మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అనుమతికి సంబంధించి అనేక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలో చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇక, 2017 మే 15న ఐఎన్ఎక్స్ మీడియాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. ఈ క్రమంలోనే సీబీఐ.. కార్తీ చిదంబరంను 2018 ఫిబ్రవరిలో అరెస్టు చేసింది. అయితే ఒక నెల తర్వాత మార్చిలో అతనికి బెయిల్ లభించింది.