
విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన అనంతరం సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో మరోసారి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థుల డిమాండ్లు, భవిష్యత్ పరీక్షల నిర్వహణ, కేసుల ఉపసంహరణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. సమావేశం ముగిసిన తర్వాత ఉభయ పక్షాలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడి చర్చల ఫలితాలను వెల్లడించాయి.
ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, కార్యకర్తలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని సీజేపీ ప్రధానంగా కోరింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు పార్టీ నేతలు తెలిపారు. దిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులను కూడా దశలవారీగా ఉపసంహరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని వెల్లడించారు. అలాగే భవిష్యత్తులో ఆందోళనల్లో పాల్గొన్న వారిని కేసుల పేరుతో వేధించబోమని కూడా స్పష్టత ఇచ్చినట్లు చెప్పారు.
मीडिया के नाम संदेश, pic.twitter.com/jvHn9F94O4
— Cockroach Janta Party (@CJP_for_India) July 25, 2026
నీట్ లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా వ్యక్తమైన ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావాలని కేంద్రం అంగీకరించినట్లు సీజేపీ ప్రతినిధులు తెలిపారు. అదే సమయంలో, ఈ ఘటన కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సహాయం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల భద్రతను మరింత బలోపేతం చేస్తామని కూడా పేర్కొన్నారు.
शांतिपूर्ण तरीके से अपने घर जाए।
: आशुतोष रंका pic.twitter.com/djh0ZNDtD7— Cockroach Janta Party (@CJP_for_India) July 25, 2026
కేంద్ర మంత్రి జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ, నిరసనల సందర్భంగా నమోదైన కేసుల ఉపసంహరణపై ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షల వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు చేపడతామని చెప్పారు. ఆందోళనల్లో పాల్గొన్న వారిపై భవిష్యత్తులో ప్రతీకార చర్యలు ఉండవని, విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
దాదాపు 36 రోజులుగా కొనసాగిన నిరసనలకు ముగింపు పలుకుతూ సీజేపీ నేతలు తమ మద్ధతుదారులకు శాంతియుతంగా ఇళ్లకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్లను అంగీకరించినందున ఇకపై ఆందోళన అవసరం లేదని వారు తెలిపారు. చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమవుతుందని ఈ పరిణామం నిరూపించిందని పేర్కొంటూ, విద్యార్థుల హక్కుల కోసం భవిష్యత్తులో కూడా అవసరమైతే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.