ఫారిన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని ముంబై దంపతులు చేసిన పనికి నెటిజన్లు ఫిదా

Published : May 14, 2025, 11:27 AM IST
ఫారిన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని ముంబై దంపతులు చేసిన పనికి నెటిజన్లు ఫిదా

సారాంశం

 ముంబైకి చెందిన ఓ దంపతులు స్ఫూర్తిదాయకంగా వ్యవహరించారు. చాలా నెలలుగా విదేశీ టూర్‌కు సన్నాహాలు చేస్తూ వచ్చిన ఈ జంట, సైనికుల త్యాగానికి గౌరవం తెలియజేస్తూ, తమ టూర్‌ను రద్దు చేసుకున్నారు.

కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన భయానక ఉగ్రదాడి పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు ఎగసిపడ్డాయి. సోషల్ మీడియా నుంచీ పార్లమెంట్ దాకా ప్రజలు తమ ఆవేదనను తీవ్రంగా వ్యక్తపరిచారు. ఈ దాడి తర్వాత జమ్ము కశ్మీర్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులు తమ టూర్లు రద్దు చేసుకున్నారు. 

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు

ఈ దాడి నేపథ్యంలో భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. రెండు దేశాల సరిహద్దుల్లో కాల్పులు, సైనిక చర్యలు మరింత ఉద్ధృతమయ్యాయి. అధికారిక సమాచారం ప్రకారం, మే 7న భారత వాయుసేన పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించి తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత ఉరి, పూంచ్,, లైన్ ఆఫ్ కంట్రోల్ ప్రాంతాల్లో కాల్పులు ఉధృతమయ్యాయి. ఈ ఎదురు దాడుల్లో ముంబై ఘాట్‌కోపర్‌కు చెందిన సైనికుడు మురళీ నాయక్ వీరమరణం పొందాడు.

దేశాన్ని కదిలించిన ముంబై దంపతుల నిర్ణయం


ఈ ఘటన నేపథ్యంలో ముంబైకి చెందిన ఓ దంపతులు స్ఫూర్తిదాయకంగా వ్యవహరించారు. చాలా నెలలుగా విదేశీ టూర్‌కు సన్నాహాలు చేస్తూ వచ్చిన ఈ జంట, సైనికుల త్యాగానికి గౌరవం తెలియజేస్తూ, తమ టూర్‌ను రద్దు చేసుకున్నారు. అంతేకాకుండా, టూర్ కోసం కేటాయించిన ₹1,09,001 రూపాయల మొత్తాన్ని శహీద్ మురళీ నాయక్ కుటుంబానికి దానం చేశారు.

ఈ విషయాన్ని ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఫోటోతో పాటు పోస్ట్ చేయగా, అది గంటల వ్యవధిలోనే వైరల్ అయింది. "దేశానికి రక్షణగా నిలిచే సైనికులు ప్రాణాల మీదకి తెచ్చుకుంటే, మనం విహారయాత్రలు చేయడం తగదు," అని వారు వెల్లడించారు.

మురళీ నాయక్ – దేశ గర్వంగా నిలిచిన వీరుడు

ఉరి సెక్టార్‌లో జరిగిన ఈ పోరాటంలో మృతిచెందిన మురళీ నాయక్, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడే అయినప్పటికీ, ఆయన కుటుంబం ముంబై ఘాట్‌కోపర్‌లో నివసిస్తోంది. తండ్రి ఒక కూలీ. కుటుంబం సాధారణ జీవితం గడుపుతోంది. ఇటీవలే ఆయన తల్లిదండ్రులు ఆంధ్రాలోని తమ ఊర్లో జాతరకు వెళ్లినప్పుడు, మురళీ మృతిచెందిన వార్త విని శోకంలో మునిగిపోయారు. మురళీ నాయక్ తల్లి బాధ చూసినవారందరికీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కానీ, మురళీ తండ్రి మాత్రం చాలా ధైర్యంగా స్పందించారు.  "నా కొడుకు దేశం కోసం ప్రాణం పోగొట్టాడు... ఇది మాకు గర్వకారణం" అని అన్నారు.

దేశం అంతటా నివాళ్లు

మురళీ నాయక్ వీరమరణానికి దేశం నివాళులర్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన త్యాగానికి శ్రద్ధాంజలి ఘటించారు. సోషల్ మీడియాలో వేలాదిమంది ప్రజలు మురళీ నాయక్ పట్ల గౌరవంతో మెసేజ్‌లు పోస్టు చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu