
లక్నో: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ కోతి శిశువు ప్రాణాలు తీసింది. నాలుగు నెలల శిశువును ఓ కోతి లాక్కుని మూడు అంతస్తుల భవనం పై నుంచి కిందకు విసిరేసింది. దీంతో ఆ శిశువు కింద పడి మరణించింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది.
బరేలీ జిల్లా దుంకా గ్రామానికి చెందిన నిర్దేశ్ ఉపాధ్యాయ్ (25)కు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. నిర్దేశ్ ఉపాధ్యాయ్, ఆయన భార్యలు మూడు అంతస్తుల భవనం పైకి వెళ్లారు. ఆ భవనం టెర్రస్ పై నాలుగేళ్ల తమ కుమారుడితో కలిసి శుక్రవారం సాయంత్రం వాకింగ్ చేశారు. అదే సందర్భంలో ఓ కోతి మూక అటు వైపుగా వచ్చింది. వాటిని వేరే వైపుగా వెళ్లగొట్టాలని ఆ దంపతులు ప్రయత్నించారు. కానీ, ఆ కోతులు అటు వెళ్లకుండా వీరిద్దరి వైపుగానే వచ్చాయి. ముఖ్యంగా కొడుకును ఎత్తుకుని నిలుచున్న నిర్దేశ్ ఉపాధ్యాయ్ను చుట్టుముట్టాయి.
వెంటనే ఆయన అక్కడి నుంచి మెట్ల వైపు పరుగెత్తే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే తన కుమారుడు ఒడిలో నుంచి జారిపోయాడు. మళ్లీ వెంటనే ఎత్తుకోవడానికి ప్రయత్నించగా.. ఓ కోతి ఆ బాలుడిని అందుకుని ఇంటి పై కప్పు నుంచి కిందకు వదిలిపెట్టింది. ఆ శిశువు కింద పడింది. స్పాట్లోనే మరణించింది.
తమకు ఈ ఘటన గురించి తెలిసిందని బరేలీ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ లలిత్ వర్మ చెప్పారు. దర్యాప్తు చేపట్టడానికి తాము ఓ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీమ్ను పంపించినట్టు తెలిపారు.