ఎంపీలో అమానుషం: కాలికి తాడుకట్టి ట్రక్ తో రోడ్డుపై ఈడిస్తే... వ్యక్తి దుర్మరణం

By Arun Kumar PFirst Published Aug 29, 2021, 11:27 AM IST
Highlights

ఓ వ్యక్తిని తాడుతో ట్రక్ కు కట్టేసి రోడ్డుపై గిరగిరా ఈఢ్చుకుంటూ తీసుకెళ్లిన దారుణం మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ అమానుష ఘటనతో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. 

బోపాల్: పాపం... అతడు దొంగో కాదో తెలీదు. కానీ కేవలం దొంగేమో అన్న అనుమానంతో అతడి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. అతడిని ఓ వాహనంతో రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి చివరకు ప్రాణాలను బలితీసుకున్నారు. ఈ దుర్ఘటన మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నీమచ్ పట్టణంలో ఓ నడివయస్కుడిని(45) దొంగగా అనుమానించారు స్థానికులు. చట్టప్రకారం అతడిని పోలీసులకు అప్పగించకుండా వారే అతడిని అత్యంత దారుణంగా శిక్షించారు. అతడిని చితకబాదిన తర్వాత కాలికి ఓ తాడుకట్టి ట్రక్ తో లాగారు. ఇలా రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. 

read more దారుణం: తండ్రి మృతితో వీధిన పడ్డ 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేసరికి అతడు తీవ్ర గాయాలతో పడివున్నాడు. దీంతో దగ్గర్లోని హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లగా పరిస్ధితి విషమంగా వుందని డాక్టర్లు చెప్పారు. దీంతో జిల్లా హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో అతడు ప్రాణాలు వదిలాడు. 

అయితే మనిషిని ట్రక్కుకు కట్టి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని ఆధారంగా మృతుడిని బండ గ్రామానికి చెందిన కన్నయ్య భీల్ గా గుర్తించారు. అలాగే అతడి మృతికి కారణమైన పదిమందిని గుర్తించగా ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మిగతావారిని కూడా అతి త్వరలో అరెస్ట్ చేస్తామని నీమంచ్ ఎస్పీ సూరజ్ వర్మ తెలిపారు. ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని... ఏదయినా వుంటే పోలీసులకు, సంబంధిత అధికారులకు తెలపాలని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు.
 

click me!