
Chandra Shekhar Aazad: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయవతిపై భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మాయావతి తన పార్టీని బీజేపీకి అమ్మేశారని ఆరోపించారు. వివరాల్లోకెళ్తే.. చంద్రశేఖర్ జార్ఖండ్లోని గర్వా జిల్లాలో నేడు పర్యటించారు. ఈ క్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మాయావతి చర్యలు బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను తీవ్రంగా దెబ్బతీశాయని, దానిని ఆయన విచ్ఛిన్నం చేయనివ్వరని అన్నారు. తనను, తన సోదరుడు-మేనల్లుడు, ఆస్తులను కాపాడుకునేందుకు మాయావతి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ముందు లొంగిపోయారని ఆరోపించారు.
ఇది దళిత సమాజానికి మాయావతి చేసిన ద్రోహమని, దీన్ని అస్సలు సహించబోమని భీమ్ ఆర్మీ చీఫ్ అన్నారు. మాయావతి మోకాలడ్డడం వల్లనే నేడు దేశంలోని ప్రతి పౌరుడు రెండు లక్షల రూపాయల విదేశీ రుణగ్రస్తులయ్యారని అన్నారు. దేశంలోని ఫాసిస్టు శక్తులను శక్తివంతంగా ఎదుర్కోగలమని, ఇందుకోసం భీమ్ ఆర్మీ తమ దళిత సంఘాలను ఏకం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోందన్నారు.
UPA ,NDA లు దళిత వ్యతిరేకులు
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు సంబంధించిన ప్రశ్నకు చంద్రశేఖర్ స్పందిస్తూ.. యూపీఏ అధికారంలో ఉన్నా, ఎన్డీఏలో ఉన్నా.. రెండు ప్రభుత్వాలు బహుజన సమాజ్ అంటే దళితులను అణచివేయడమేనని, దానిని సహించేది లేదని అన్నారు. భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు జగ్జీవన్ రామ్ను పోలీసులు లాతేహార్లో అరెస్టు చేశారని, తద్వారా మా కార్యక్రమాన్ని అడ్డుకోవచ్చని చంద్రశేఖర్ చెప్పారు.
అంబేద్కర్ ఆశయాలపై నిరంతరం కృషి చేస్తాం
ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని, దీనికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని చంద్రశేఖర్ అన్నారు. భాజపాతో సహా అన్ని పార్టీలు బహుజన సమాజ్ వ్యతిరేకమని, అంబేద్కర్ ఆశయాలను ఆచరించే వరకు దళితుల చైతన్యం కోసం కృషి చేస్తూనే ఉంటామని అన్నారు.