
search operation in Poonch, Rajouri sectors: పూంచ్, రాజౌరీ సెక్టార్ల అడవుల్లో భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఆరేడు మంది ఉగ్రవాదులు ఇక్కడ తలదాచుకున్నట్లు భావిస్తున్నారు. పలు చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అడవుల చుట్టుపక్కల ఉన్న ప్రజల ఇండ్లలో కూడా సోదారు నిర్వహిస్తూ వారిని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ ఉగ్రదాడిలో మరణించిన ఐదుగురు జవాన్లలో నలుగురు పంజాబ్ కు చెందినవారు ఉన్నారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. సైన్యం డ్రోన్లు, హెలికాప్టర్లతో గాలింపుతో పాటు అనేక ప్రత్యేక దళాల బృందాలను రంగంలోకి దించింది. సంబంధిత ప్రాంతంలో సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇదే ప్రాంతంలో ఉంటారని భావిస్తూ.. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో పాటు పలు ప్రత్యేక దళాల బృందాలను రంగంలోకి దింపిన ఆర్మీ ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. ఆర్మీ, పోలీస్, ఇంటెలిజెన్స్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. రాజౌరీ, పూంచ్ సరిహద్దులను ఆనుకుని ఉన్న భటాదుడియన్ ప్రాంతంలో రెండు గ్రూపులుగా 6 నుంచి 7 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు ఆర్మీ, భద్రతా సంస్థలకు సమాచారం అందిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ఈ ఉగ్రవాదులు గురువారం భారత ఆర్మీ వాహనంపై దాడి చేసి ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఉగ్రవాదులకు లష్కరే తోయిబా లేదా పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వారు ఆ ప్రాంతంలోకి ప్రవేశించే మార్గం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. భటాదుడియన్ లో గురువారం జరిగిన దాడిలో ఉగ్రవాదులు, ఓజీడబ్ల్యూలు, జిగురు బాంబులు లేదా మరేదైనా అంటుకునే రసాయనాన్ని ఉపయోగించి ఉంటారని అనుమానిస్తున్నారు. మిలటరీ వాహనంలో మంటలు చెలరేగడం, ఒక్క సైనికుడు కూడా తప్పించుకునే అవకాశం లేకపోవడంతో అందులో కెమికల్ ఉపయోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రమాదానికి ముందు పిడుగుపాటు లాంటి శబ్దం..
ఆర్మీ వాహనంపై దాడికి ముందు ఆ ప్రాంతంలో పెద్ద పిడుటుపాటు లాంటి శబ్దం వినిపించిందని స్థానికులు చెప్పారు. ఆ తర్వాత భారీ పేలుడు శబ్దం వినిపించింది. క్షణాల్లో ఆర్మీ వాహనానికి మంటలు అంటుకున్న శబ్దం వినిపించిందని తెలిపారు.