
Odisha triple talaq: సైబర్ మోసానికి గురై డబ్బు పోగొట్టుకున్న భార్యకు భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ క్రమంలోనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనను వరకట్న సంబంధిత చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు అధికారులను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ నివేదించింది. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
వివరాల్లోకెళ్తే.. సైబర్ మోసానికి గురై డబ్బులు పోగొట్టుకున్న భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన ఓ వ్యక్తిపై ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.1.5 లక్షలు పోగొట్టుకున్నానని ఒప్పుకోవడంతో తన భర్త తనకు అక్రమంగా విడాకులు (ట్రిపుల్ తలాక్ చెప్పాడని) ఇచ్చాడని ఒడిశాలోని కేంద్రపారా జిల్లాకు చెందిన 32 ఏళ్ల మహిళ ఏప్రిల్ 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అలాగే, తనను వరకట్న సంబంధిత చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు అధికారులను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ నివేదించింది. నిందితుడిపై ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం, ఐపీసీ, వరకట్న నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కేంద్రపారా సదర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సరోజ్ కుమార్ సాహూ తెలిపారు. వీరిద్దరికీ గత 15 ఏళ్ల క్రితం వివాహమైందని, నిందితుడు ప్రస్తుతం గుజరాత్ లో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
తక్షణ విడాకులు - ట్రిపుల్ తలాక్ అనే వివాదాస్పద పద్ధతిని సుప్రీంకోర్టు 2017 లో నిషేధించింది. ఇది పవిత్ర ఖురాన్ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం, ఇస్లామిక్ చట్టం షరియత్ ను ఉల్లంఘించడంతో సహా అనేక కారణాలతో దానిని కొట్టివేసింది. దీన్ని ఆచరిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది.