15 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్’ కేటగిరి భద్రత కల్పించింది. దీంతో వారికి సీఆర్ పీఎఫ్ కమాండోలు సెక్యూరిటీ అందించనున్నారు.
మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే శిబిరంలోని 15 మంది తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం సాయుధ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) Y+ కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ మేరకు ఆదివారం అధికార వర్గాలు వివరాలు వెల్లడించాయి. CRPF సెక్యూరిటీ భద్రతను పొందిన ఎమ్మెల్యేలలో రమేష్ బోర్నారే, మంగేష్ కుడాల్కర్, సంజయ్ శిర్సత్, లతాబాయి సోనావానే, ప్రకాశ్ సర్వే, సదానంద్ సరనవంకర్, యోగేష్ దాదా కదమ్, ప్రతాప్ సర్నాయక్, యామినీ జాదవ్, ప్రదీప్ జైస్వాల్, సంజయ్ రథోడ్ భూసే, దిలీప్ లాండే, బాలాజీ కళ్యాణర్, సందీపన్ భూమారే ఉన్నారు.
మహా సంక్షోభం.. రంగంలోకి దిగిన ఉద్ధవ్ ఠాక్రే సతీమణి.. రెబల్ ఎమ్మెల్యేల భార్యలకు ఫోన్లు
తిరుగుబాటు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు కల్పించిన భద్రతను ఉపసంహరించుకున్నారని తిరుగుబాటు ఎమ్మెల్యే నాయకుడు ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్, డీజీపీ రజనీష్ సేథ్ లకు లేఖ రాశారు. ఈ పరిణామం చోటు చేసుకున్న ఒక రోజు తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఏక్ నాథ్ షిండే చేసిన ఆరోపణలను ఎంవీఏ (MVA) ప్రభుత్వం తిరస్కరించింది.
రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ఇప్పట్లో ముగిసిపోయేలా కనిపించడం లేదు. మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం షిండే నేతృత్వంలోని సేన ఎమ్మెల్యేల బృందం మధ్య రాజకీయ పోరాటం జరుగుతోంది. రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు ప్రతిపక్ష బీజేపీ కారణమని ఎంవీఏ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే కాషాయ పార్టీ ఆరోపణలను కొట్టిపారేసింది. ఈ సంక్షోభంలో తమ పాత్ర లేదని పేర్కొంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే శనివారం మీడియాతో తెలిపారు. ‘‘ రాష్ట్ర మంత్రి, శివసేన తిరుగుబాటుదారుడు ఏక్ నాథ్ షిండే కు మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. తద్వారా MVA ప్రభుత్వం మైనారిటీకి పడిపోయింది. ఈ సంక్షోభంలో బీజేపీ పాత్ర ఏమీ లేదు. ఈ తిరుగుబాటును బీజేపీ ప్రారంభించలేదు. అలాగని మద్దతు కూడా ఇవ్వలేదు. ఈ విషయంలో బీజేపీ వేచి చూస్తుందని ఆయన (ఫడ్నవీస్) నాకు చెప్పారు.’’
‘‘గౌహతిలో ఎంతకాలం దాక్కుంటారు ?’’ - తిరుగుబాటు ఎమ్మెల్యేలకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వార్నింగ్
కాగా ఏక్ నాథ్ షిండే శనివారం రాత్రి గుజరాత్లోని వడోదరలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ను కలిశారు. మహారాష్ట్రలో పాలన మార్పుపై ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా నిన్న రాత్రి వడోదరలో ఉన్నారని తెలుస్తోంది. అయితే శనివారం ఉద్దవ్ ఠాక్రేకు విధేయులైన సేన కార్యకర్తలు తిరుగుబాటు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వారి బ్యానర్లను ధ్వంసం చేశారు. కొన్ని చోట్ల రాళ్లు రువ్వారు. పలువురు ఎమ్మెల్యేల కార్యాయాలను ధ్వంసం చేశారు. దీంతో షిండే ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ నా ప్రియమైన శివసేన కార్యకర్తలారా.. MVA కుతంత్రాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. MVA కొండచిలువ బారి నుండి శివసేన, సేన కార్యకర్తలను రక్షించడం కోసం నేను పోరాడుతున్నాను. నేను ఈ పోరాటాన్ని శివసేన కార్యకర్తల ప్రయోజనాల కోసం అంకితం చేస్తున్నాను ’’ అని ఆయన మరాఠీలో ట్వీట్ చేశారు.