యూపీ ఎమ్మెల్యే మర్డర్ కేసులో ప్రధాన సాక్షి దారుణ హత్య.. పట్టపగలే నడి రోడ్డుపై కాల్చివేత.. (వీడియో)

Published : Feb 25, 2023, 01:05 PM IST
యూపీ ఎమ్మెల్యే మర్డర్ కేసులో ప్రధాన సాక్షి దారుణ హత్య.. పట్టపగలే నడి రోడ్డుపై కాల్చివేత.. (వీడియో)

సారాంశం

ఓ ఎమ్మెల్యే మర్డర్ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వ్యక్తిని కొందరు దుండగులు పట్టపగలే అతని ఇంటి వెలుపలే దారుణంగా హతమార్చారు. కారులో నుంచి అడుగు బయట పెట్టగానే కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ఎమ్మెల్యే హత్య కేసులో సాక్షిగా ఉన్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టపగలే నడి రోడ్డుపై శుక్రవారం అతడిని కొందరు దుండగులు కాల్చి చంపేశారు. అతడిని కాపాడటానికి ప్రయత్నించిన ఇద్దరు బాడీగార్డులకూ బుల్లెట్లు దిగాయి. ఈ ఘటన పలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ వీడియో ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది.

2005లో బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య జరిగింది. ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న డాన్, మాజీ లోక్ సభ ఎంపీ అతీఖ్ అహ్మద్ ప్రస్తుతం గుజరాత్‌లోని జైలులో ఉన్నాడు. ఈ హత్య కేసులో ప్రధాన సాక్షి ఉమేశ్ పాల్.

ప్రయాగ్‌రాజ్‌లోని ఉమేశ్ పాల్ ఇంటి ఎదుటే ఈ ఘటన జరిగింది. ఉమేశ్ పాల్ తన ఇంటి సమీపంలో హ్యుండాయ్ క్రెటా ఎస్‌యూవీ వెనుక సీటులో నుంచి కిందికి దిగుతున్నాడు. అప్పుడే కారు వెనుక నుంచి తుపాకీతో ఓ దుండగుడు అతడిపై కాల్పులు జరిపాడు. మరొకరు అక్కడ ఓ క్రూడ్ బాంబ్ పేల్చాడు. దీంతో అక్కడంతా పొగ వ్యాపించింది. రోడ్డు పై ఉన్న వారు షాపుల్లోకి పరుగులు తీశారు. 

కారు నుంచి బయట అడుగు పెట్టగానే కాల్చడంతో ఉమేశ్ పాల్ తొలుత కింద పడిపోయాడు. ఇంతలో అక్కడికి బాడీగార్డ్ వచ్చాడు. ఆ వెంటనే ఉమేశ్ పాల్ మళ్లీ పైకి లేచి ఎదురుగా ఉన్న చిన్న సందులోకి పరుగు తీశాడు. అతడి వెంటే ఆ దుండగుడూ వెళ్లాడు. చివరిగా షాట్ చేసి అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. అప్పటికే ఉమేశ్ పాల్ గాయాలతో నేలపై పడిపోయాడు. ఆ దుండగులను పట్టుకునే ప్రయత్నంలో ఇద్దరు బాడీగార్డులకూ బుల్లెట్ గాయాలయ్యాయి.

Also Read: 70 కి.మీలు వెళ్లి 512 కిలోల ఉల్లిగడ్డలు అమ్మిన రైతు.. చెక్ పై ఎన్ని డబ్బులు వచ్చాయో చూస్తే ఖంగుతింటారు!

ఈ ఘటన ఉమేశ్ పాల్ ఇంటి బయటే జరిగిందని ప్రయాగ్ రాజ్ పోలీసు చీఫ్ రమిత్ శర్మ విలేకరులకు తెలిపారు. అక్కడ రెండు బాంబులు పేల్చినట్టు ధ్రువీకరించారు. చిన్న ఫైర్ ఆర్మ్‌తో వారిపై కాల్పులు జరిపారని వివరించారు.

ఉమేశ్ పాల్‌ను సమీప హాస్పిటల్‌కు తరలించామని చెప్పారు. చికిత్స పొందుతూనే అతను మరణించాడని వివరించారు. కాగా, ఒక బాడీగార్డు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. మరో బాడీగార్డుపై వైద్యులు సర్జరీ నిర్వహిస్తున్నారని పోలీసులు వివరించారు.

ఈ ఘటనపై మర్డర్ కేసు ఫైల్ చేశామని పోలీసులు తెలిపారు. కేసులో దర్యాప్తు మొదలు పెట్టినట్టు చెప్పారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu