
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య శనివారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులు మరణించారు. మరికొందరికి గాయలైనట్టుగా తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) బృందం జాగర్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. సెర్చ్ ఆపరేషన్లో ఉన్నప్పుడు జాగర్గుండ, కుండేడ్ గ్రామాల మధ్య శనివారం ఉదయం 9 గంటలకు పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదుకాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ ఎదురుకాల్పుల్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) సహా ముగ్గురు జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) సిబ్బంది మరణించారు. మృతిచెందినవారిలో ఏఎస్ఐ రామురామ్ నాగ్, అసిస్టెంట్ కానిస్టేబుల్ కుంజం జోగా, సైనిక్ వనజం భీమా ఉన్నారు. ఇక, ఎదురుకాల్పుల విషయం తెలుసుకున్న వెంటనే ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించారు. ఇక, ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.