ఆవు మాంసం తిన్నందుకే.. కేరళకు వరదలా..?

By ramya neerukondaFirst Published Aug 27, 2018, 12:19 PM IST
Highlights

దేవ భూమిగా పేరొందిన చోట విచ్చలవిడిగా ఆవు మాంసం విక్రయాలు చేశారు. బీఫ్‌ ఫెస్టివల్‌తో విర్రవీగారు. ఆ ఫెస్టివల్‌ చేసుకున్న ఏడాదిలోనే ఇంతటి ప్రకృతి విలయం సంభవించింది.

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో.. బీజేపీ నేతలు ముందుంటారు. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియా ముందు బుక్కయ్యారు. తాజాగా.. మరో ఎమ్మెల్యే ఈ జాబితాలో చోటుదక్కించుకున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన కేరళ మీద కామెంట్ చేసి.. వివాదంలో చుక్కుకున్నారు.

భారీ వర్షాలు, వరదలతో కేరళకు తగిన శాస్తి జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే  బసనగౌడ్ పాటిల్ అన్నారు. దేవభూమిగా పేరొందిన గడ్డపై ఆవు మాంసం తినడంతోనే ఇంతటి ప్రకృతి విపత్తుకు గురైందని అన్నారు. పశుమాంసం తినేవారెవరైనా దేవుని ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ‘చూడండి కేరళలో ఏం జరిగిందో..! దేవ భూమిగా పేరొందిన చోట విచ్చలవిడిగా ఆవు మాంసం విక్రయాలు చేశారు. బీఫ్‌ ఫెస్టివల్‌తో విర్రవీగారు. ఆ ఫెస్టివల్‌ చేసుకున్న ఏడాదిలోనే ఇంతటి ప్రకృతి విలయం సంభవించింద’ని శుక్రవారం జగిరిన విలేకర్ల సమావేశంలో ఎద్దేవా చేశారు. బసనగౌడ విజయపుర నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

కాగా, పశు మాంసం అమ్మకాలను నిషేదిస్తూ 2017లో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా కేరళకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీఫ్‌ ఫెస్టివల్‌ పేరిట కేంద్రానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి లావణ్య స్పందించారు. ప్రజల్ని రెచ్చగొట్టే, వారి మనోభావాలు దెబ్బతీసేలా మట్లాడడం బీజేపీ నేతలు మానుకుంటే మంచిదని హెచ్చరించారు.

బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ప్రకృతి విపత్తులు సంభవించాయన్నారు. ప్రజల అలవాట్లతో ప్రకృతి విధ్వంసానికి ముడి పెట్టొద్దని హితవు పలికారు. జేడీఎస్‌ జాతీయ అధికార ప్రతినిధి తన్వీర్‌ అ​హ్మద్‌ కూడా బసనగౌడపై మండిపడ్డారు. సమాజానికి ఉపయోగపడని బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో కాలం వెళ్లదీస్తారని చురకలంటించారు.

click me!
Last Updated Sep 9, 2018, 11:43 AM IST
click me!