వాజ్‌పేయ్ ఆగస్టు 16న మరణించలేదా...? శివసేన నేత సంచలన వ్యాఖ్యలు

By sivanagaprasad KodatiFirst Published Aug 27, 2018, 11:11 AM IST
Highlights

దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. శివసేన నేత సంజయ్ రావుత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి

దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. శివసేన నేత సంజయ్ రావుత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. శివసేన అధికార పత్రిక ‘‘ సామ్నా’’లో సంజయ్ ఓ వ్యాసం రాశారు.

ఇందులో అధికారికంగా ఆగస్టు 16న అటల్‌జీ కన్నుమూశారు... అయితే అంతకు కొద్ది రోజుల నుంచే వాజ్‌పేయ్ ఆరోగ్యం విషమంగా ఉంది. అయితే అటల్‌జీ ముందుగానే మరణించినా ... స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగానికి ఎలాంటి అడ్డంకులు ఉండేందుకే ఆయన మరణాన్ని గోప్యంగా ఉంచి ఆలస్యంగా వెల్లడించారని సంజయ్ సందేహం వ్యక్తం చేశారు.

స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశవ్యాప్తంగా జాతీయ సంతాపం, పతాక అవనతాలను తప్పించేందుకు.. ఆ తర్వాతి రోజు వాజ్‌పేయ్ మరణించినట్లు ప్రకటించారా..?అంటూ రావుత్ వ్యాసంలో పేర్కొన్నారు. అయితే ఈ అనుమానాలకు గల కారణాలను మాత్రం సంజయ్ వెల్లడించలేదు.

click me!