కేరళలో ప్రకృతి విలయం...324మంది మృతి

By sivanagaprasad KodatiFirst Published Aug 17, 2018, 6:56 PM IST
Highlights

పర్యాటక మణిహారంగా పిలిచే కేరళ వరదలతో అస్తవ్యస్థంగా మారింది. తొమ్మిది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చిగురుటాకులా వణుకుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులన్నీ పొంగి పొర్లుతున్నాయి

కొచ్చి: పర్యాటక మణిహారంగా పిలిచే కేరళ వరదలతో అస్తవ్యస్థంగా మారింది. తొమ్మిది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చిగురుటాకులా వణుకుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులన్నీ పొంగి పొర్లుతున్నాయి. వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 80 ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. మరో మూడు రోజులపాటు కుండపోత వర్షం కురిసే అవకాశం ఉండటంతో 13 జిల్లాల్లో రెడ్ అలర్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇప్పటి వరకు వరదల ప్రభావానికి 324 మంది మృత్యువాత పడ్డారు. దాదాపుగా రెండు లక్షల మందిని సహాయక బృందాలు పునరావాస కేంద్రాలకు తరలించారు.  

మరోవైపు కేరళలో ప్రకృతి ప్రకోపానికి రహదారులు కొట్టుకుపోవడంతో జనజీవనం స్థంభించిపోయింది. పలు గ్రామాలు నీటమునగడంతో ఎయిర్ లిఫ్ట్ విధానం ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది 4వేల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించగా 1, 764 మందిని రక్షించారు.

అటు కేరళలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి బయలు దేరారు. రాత్రికి కొచ్చిలో బస చేసి శనివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.

మరోవైపు కేరళలోని వరద ప్రభావిత ప్రంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నాలుగు కోస్ట్ గార్డ్ కేపిటల్ షిప్స్ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో కలసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 24 బృందాలు వరద ప్రభావిత గ్రామాల్లో సహాయక చర్యలు అందిస్తున్నాయి. 

 వారం రోజులుగా కేరళ అంధకారంలో కొట్టుమిట్టాడుతోంది. విద్యుత్ లేకపోవడంతో చెమ్మచీకటిలోనే బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. మరోవైపు నిత్యావసర వస్తువులు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

click me!