నాయకులను కాదు బీజేపీ ప్రజాసేవకులను తయారు చేస్తుంది: రాజీవ్ చంద్రశేఖర్

Published : Apr 20, 2025, 02:50 PM IST
నాయకులను కాదు బీజేపీ  ప్రజాసేవకులను తయారు చేస్తుంది: రాజీవ్ చంద్రశేఖర్

సారాంశం

తిరువనంతపురం దక్షిణ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి  కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను ప్రస్తావించారు. బీజేపీ నాయకులను కాదు, ప్రజాసేవకులను తయారు చేయడంపై దృష్టి సారించిందని అన్నారు. ఇంకా  ఆయన ఏమన్నారంటే.. 

తిరువనంతపురం: కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ తన లక్ష్యం రాజకీయ నాయకులను తయారు చేయడం కాదని, ప్రజల సంక్షేమానికి అంకితమైన ప్రజాసేవకులను తయారు చేయడమేనని తెలిపారు. బీజేపీ తిరువనంతపురం దక్షిణ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పార్టీ అన్ని జిల్లా కార్యాలయాలు ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి వేదికలుగా, ప్రజలకు సహాయ కేంద్రాలుగా పనిచేస్తాయని చంద్రశేఖర్ అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 2న తిరువనంతపురంకు రానున్నారని, ఇది పార్టీతో పాటు, కేరళ ప్రజలకు ఎంతో ముఖ్యమైందని  ఆయన తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తేనే కేరళలో పెద్ద రాజకీయ మార్పు సాధ్యమవుతుందని ఆయన అన్నారు. కొత్తగా ప్రారంభించిన జిల్లా కార్యాలయాలు ఈ పరివర్తనకు కేంద్రాలుగా ఉంటాయని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ప్రతిభ కనబరిచిన వారే భవిష్యత్తులో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎదుగుతారని, ప్రజల నమ్మకాన్ని సంపాదించి ఎన్నికల్లో గెలవడమే బీజేపీలో నాయకత్వానికి మార్గమని ఆయన చెప్పుకొచ్చారు. 

బీజేపీలో ఎమ్మెల్యే లేదా ఎంపీ కావడానికి ఏకైక అర్హత ప్రజల ఆమోదమేనని చంద్రశేఖర్ పునరుద్ఘాటించారు. “ఎవరు నాయకత్వం వహించాలో ప్రజలే నిర్ణయిస్తారు” అని ఆయన అన్నారు.

కేరళ సాంప్రదాయ రాజకీయ కూటములను విమర్శిస్తూ, ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌ల మధ్య నిజమైన తేడా లేదని చంద్రశేఖర్ అన్నారు. “ఇద్దరూ ప్రజల్లో ప్రతికూలతను వ్యాప్తి చేయడంలో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు, బీజేపీ అందరితోనూ నిలబడి, అందరి కోసం పనిచేసే అంకితభావంతో కూడిన కార్యకర్తల పార్టీ” అని ఆయన అన్నారు.

మే 2న విజిన్‌జామ్‌లో ప్రధానమంత్రి మోడీకి ఘన స్వాగతం పలకాలని పిలుపునిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు. తిరువనంతపురం దక్షిణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన విజయాలు సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu