కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గేమ్ చేంజర్: కవిత

First Published May 23, 2018, 10:23 AM IST
Highlights

ఫెడరల్ ఫ్రంట్ గేమ్ చేంజర్ అని, తమ ఎజెండా మెచ్చి వచ్చేవారిని స్వాగతిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

న్యూఢిల్లీ: ఫెడరల్ ఫ్రంట్ గేమ్ చేంజర్ అని, తమ ఎజెండా మెచ్చి వచ్చేవారిని స్వాగతిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఫ్రంట్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని, తమది బలమైనపార్టీ కాబట్టే బీజేపీ ఏజెంట్, కాంగ్రెస్ ఏజెంట్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని  ఆమె అన్నారు.

దేశంలో ప్రభుత్వాల మార్పిడి కాకుండా వ్యవస్థలో మార్పులు రావల్సి ఉందని అన్నారు. ఢిల్లీలోని భారతీయ మహిళా పాత్రికేయుల సంఘం (ఐడబ్ల్యూపీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠిలో ఆమె వివిధ విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. 

రాష్ట్రాల అభిప్రాయాలు స్వీకరించకుండానే మోడీ ప్రభుత్వం విధానాలు రూపొందించడం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. నాలుగేళ్లలో దేశంలో పాలనాపరంగా ఎటువంటి మార్పులు తీసుకురాలేదని, చివరి ఏడాదైనా ఏమైనా తీసుకువస్తారేమో చూడాలని అన్నారు. మోడీ తనకు వచ్చిన అవకాశాన్ని వాడుగకోలేకపోయారని అన్నారు.

బిజెపితో తాము సన్నిహితంగా ఏమీ లేమని, కేంద్ర ప్రభుత్వంతో పాలనాపరమైన సంబంధాలే కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ప్రతిపాదించిన ఫెడరల్‌ ఫ్రంట్‌ దేశ రాజకీయాల్లో మార్పు తెస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులను ఆదుకునేందుకే రైతుబంధు పథకం పెట్టామని చెప్పారు.

రైతులు వడ్డీ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పంట పెట్టుబడి పథకం విజయవంతమైందని అన్నారు. రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినప్పటికీ రైతులు మళ్లీ అప్పుల పాలవుతున్నారని, ఈ కష్టాల నుంచి గట్టెక్కించేందుకే రైతుబంధు పథకం తెచ్చామని అన్నారు. 
ఉత్తర, దక్షిణ రాష్ట్రాలు అనే తేడాలు వద్దని, మనమందరం భారతీయులమని అన్నారు. 

click me!